Tomato | లక్నో: ‘ఉల్లిపాయలు తినకండి. మా ఇంట్లో వాటిని వాడటం లేదు. తినడం మానేస్తేనే ధరలు కిందికి దిగి వస్తాయి’ 2019లో ఉల్లిపాయల ధరల పెరుగుదలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రజలు భగ్గుమన్నారు. సరిగ్గా ఆ తరహాలోనే తాజాగా బీజేపీ నాయకురాలు, ఉత్తరప్రదేశ్ మంత్రి ఒకరు టమాట ధరలపై వ్యాఖ్యానించి సామాన్యుల ఆగ్రహానికి గురయ్యారు. ‘టమాటాలు తినడం మానేయండి. వాటిని ఇంట్లోనే పండించుకోండి. టమాటాల బదులుగా నిమ్మకాయలను వాడుకోవచ్చు. అందరూ టమాటాలు తినడం మానేస్తేనే వాటి ధరలు దిగివస్తాయి’ అని యూపీ మంత్రి ప్రతిభా శుక్లా ప్రజలకు ఉచిత సలహాలు ఇచ్చారు.
బాధ్యత గల హోదాలో ఉన్న ఆమె చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేతలు, సామాన్యులు మండిపడుతున్నారు. సమస్యలను పరిష్కరించడంలో చిట్టచివరన ఉండే బీజేపీ నేతలు… ఇలా ఉచిత సలహాలు ఇవ్వడంలో మాత్రం అందరికంటే ముందుంటారని తూర్పారబడుతున్నారు. ఒకవేళ బియ్యం ధరలు పెరిగితే ‘భోజనం చేయడం మానేయండి. బియ్యం ధరలు కిందకి దిగి వస్తాయి’ అని బీజేపీ నేతలు ఉచిత సలహాలు ఇస్తారేమో అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ధరలను అదుపు చేయడంలో విఫలమైన బీజేపీ ప్రభుత్వం చౌకబారు సలహాలు ఇస్తున్నదని విమర్శిస్తున్నారు.