భోపాల్, ఆగస్టు 9: ఆయన పేరు మహేశ్ కటారే సుగమ్. మధ్యప్రదేశ్కి చెందిన ప్రముఖ కవి. హిందీ అకాడమీ అవార్డుతో పాటు పలు పురస్కారాలు అందుకున్నారు. ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు, స్థానిక, జాతీయ సమస్యలపై కవితలతో పాటు ప్రత్యక్షంగా గళమెత్తుతారని పేరు. తాను నివాసం ఉంటున్న సాగర్ జిల్లా బీనా మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) పరిధిలోని మధుర్ కాలనీలో రోడ్లు, నీటి సరఫరా, విద్యుత్తు, డ్రైనేజీ వ్యవస్థ వంటి కనీస మౌలిక సదుపాయాల లేమి సమస్యలను లేవనెత్తారు. ‘పట్టణ అధికారులు నిద్రపోతున్నారు.. బీనా వాసులు సమస్యలతో ఏడుస్తున్నారు..’ అని ఓ కవిత కూడా రాశారు. ఇది మధ్యప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వానికి కంటగింపుగా మారింది. వెంటనే మహేశ్ కటారేపై తనదైన ‘బుల్డోజర్’ రాజకీయాన్ని ప్రయోగించింది. మీ నివాసం అక్రమమని, సరైన పత్రాలు లేవని, ఇంటిని కూల్చివేస్తామంటూ మున్సిపల్ అధికారులతో నోటీసులు ఇప్పించింది. సమస్యలు లేవనెత్తితే.. కక్షసాధింపు చర్యలకు పాల్పడడంపై విమర్శలు వస్తున్నాయి.
సమస్యలు లేవనెత్తానన్న కక్షతోనే..
మహేశ్ కటారే 2011లో తన కుటుంబంతో కలిసి బినా పట్టణంలోని చంద్రశేఖర్ వార్డులో స్థిరపడ్డారు. ఇండ్లు నిర్మించిందేమో భార్య మీరా పేరుపై.. నోటీసులు ఇచ్చిందేమో కుమారుడు ప్రభా త్ పేరుతో! అయితే, తన ఇండ్లు అక్రమం కాదని, బిల్డింగ్ లేఅవుట్కు 2011, మార్చి 26న కార్పొరేషన్ అధికారులు ఆమోదించారని, నిర్మాణానికి అనుమతులన్నీ పొందానని, ఇంటి పన్ను కూడా సక్రమంగా చెల్లిస్తూ వస్తున్నానని, సంబంధిత పత్రా లన్సీ తన వద్ద ఉన్నాయని మహేశ్ కటారే చెబుతున్నారు. మధుర్ కాలనీలో అనేక అక్రమ కట్టడాలు ఉన్నాయని, కానీ స్థానిక సమస్యలు లేవనెత్తానన్న కక్షతో అధికారులు తమకు నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు.
మహేశ్ కటారే గతంలో సీఎం హైల్ప్లైన్ తీరుపై స్థానిక అధికారులకు ఫిర్యాదు చేశారు. దీని తర్వాత ఓ అధికారి తమ కాలనీకి వచ్చి, ఫిర్యాదు ఉపసంహరించుకోవాలని, ఇందుకు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ ఫిర్యాదును ఉపసంహరించుకున్న తర్వాతనే తాజా నోటీసులు వచ్చాయని కటారే వివరించారు.