న్యూఢిల్లీ, జనవరి 24: బీజేపీని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఓడించడం సాధ్యమేనని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. అందుకు అవసరమైన విపక్ష ఫ్రంట్ ఏర్పాటులో తోడ్పాటు అందిస్తానని తెలిపారు. వచ్చేనెల జరిగే ఐదు రాష్ర్టాల ఎన్నికల ఫలితాలు విపక్షాలకు ప్రతికూలంగా వచ్చినా ఇది జరిగి తీరుతుందని ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘2024లో బీజేపీని ఓడించడం సాధ్యమా? అని నన్ను ప్రశ్నిస్తే సాధ్యమేనని చెప్తా. కానీ ప్రస్తుత పార్టీలు, కూటములతోనా అంటే బహుశా కాదనే సమాధానం ఇవ్వాల్సి వస్తుంది’ అన్నారు. బీహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఏపీ, తెలంగాణ రాష్ర్టాల్లో సుమారు 200 ఎంపీ స్థానాలుంటే బీజేపీ గరిష్ఠంగా 50 మాత్రమే పొందగలుగుతున్నది. ఇక ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో 350 స్థానాలుంటే అందులో అత్యధికంగా బీజేపీ సాధిస్తున్నది. ఈ ప్రాంతాల్లో విపక్షాలు మరో 100 స్థానాలు సంపాదించగలిగితే.. బీజేపీ ఓడిపోవడం ఖాయమని అభిప్రాయపడ్డారు.
దూరదృష్టి అవసరం
బీజేపీని ఓడించేందుకు కొత్త జాతీయ పార్టీ అవసరం లేదని ప్రశాంత్ కిశోర్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత విపక్ష పార్టీల మధ్య కొన్ని దిద్దుబాట్లు, సర్దుబాట్లు చేస్తే సరిపోతుందని సలహానిచ్చారు. ‘కాంగ్రెస్, తృణమూల్, లేదా మరే ఇతర పార్టీ తమ మధ్య సర్దుబాట్లు చేసుకోవాలి.. కొత్త కూటములు రావాలి.. అందుకు తగిన సాయం చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నా’ అని కిశోర్ అన్నారు. హిందూత్వ, జాతీయవాదం, సంక్షేమం.. మూడింటిని కలగలిపి బలమైన విధానాన్ని బీజేపీ రూపొందించుకొన్నదని చెప్పారు. ఇందులో కనీసం రెండింటిలో బీజేపీపై ఆధిక్యత సాధించాలని సూచించారు. 200 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ముఖాముఖి పోటీ జరుగుతుందని, ఇందులో 95% బీజేపీ నెగ్గుకువస్తుందని గుర్తు చేశారు. బీజేపీని ఓడించాలంటే 5-10 సంవత్సరాల దూరదృష్టి, వ్యూహాలు కావాలన్నారు.
ప్రతీకారం అనొద్దు
కాంగ్రెస్ పార్టీతో తాను జరిపిన సంప్రదింపులు విఫలం కావడంతో ప్రతీకారంగా తృణమూల్ను జాతీయ స్థాయిలో ముందుకు తెచ్చేందుకు తాను తోడ్పడుతున్నానని అనడం, అసలు దీనిని ‘ప్రతీకారం’ అని పిలవడం కూడా సరికాదని కిశోర్ అన్నారు. మనదేశంలో బలమైన ప్రజాస్వామ్యం అవసరమని, కాంగ్రెస్ అనే భావనను బలహీనపడేలా చేయకూడదని హితవు చెప్పారు. కాంగ్రెస్ నుంచి తృణమూల్కు వలసలు జరిగేలా మీరు చూస్తున్నారా? అని అడిగితే మమత పార్టీకి తమ సంస్థ ఐ-ప్యాక్తో ఒప్పందం కుదిరిందని, వారు ఏ సాయం అడిగినా అందిస్తానని చెప్పారు.