PM Awas Yojana | న్యూఢిల్లీ, అక్టోబర్ 13: కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం లబ్ధిదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం కింద ఇల్లు నిర్మించుకోవడానికి కేంద్రం చాలీచాలని మొత్తం కేటాయించిందని, అవి పూర్తి చేయడానికి అప్పులు చేయాల్సి వచ్చిందని వారు వాపోతున్నారు. పీఎంఏవై-జి పథకం లబ్ధిదారుల్లో 80 శాతం తమ గృహాల నిర్మాణానికి 1.50 లక్షల రూపాయలకు పైగానే వెచ్చించారు.
ఈ పథకం కింద మైదాన ప్రాంతం వారికి రూ.1.20 లక్షలు, పర్వత ప్రాంతాల వారికి రూ.1.30 లక్షలే కేటాయించారు. అయితే చాలాచోట్ల కేటాయించిన మొత్తం కన్నా ఎక్కువగా లబ్ధిదారులకు ఖర్చయినట్టు నేషనల్ లెవెల్ మానిటరింగ్ (ఎన్ఎల్ఎం) అనే స్వతంత్ర సంస్థ ప్రతినిధులు మూడు దశల్లో జరిపిన సర్వేలో నిర్ధారించారు. ఈ గృహాల నిర్మాణానికి లబ్ధిదారులు రూ.1.50లక్షల నుంచి రూ.౭ లక్షల వరకు ఖర్చు చేసినట్టు ఎన్ఎల్ఎం వెల్లడించింది.
దేశవ్యాప్తంగా 15 వేల మంది లబ్ధిదారులను ప్రశ్నించిన వీరు తమ సర్వే వివరాలను వెల్లడించారు. 2022 లో మూడు దశల్లో ఈ సర్వే జరిపామని చెప్పారు. అలాగే పీఎంఏవై-జీ గురించి వివరించే వెబ్ ఆధారిత వేదిక ఆవాజ్ సాఫ్ట్లో పేర్కొన్న విషయాలు చాలావరకు వాస్తవదూరంగా ఉన్నాయని పేర్కొంది.
దీనికి సంబంధించిన మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎంఐఎస్)లో నిర్మాణంలో ఉన్న ఇళ్లను కూడా పూర్తయినట్టు చూపిస్తున్నారని, అందులోని ఫొటోలు చాలావరకు నకిలీవేనని ఆరోపించింది. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, బీహార్, ఛత్తీస్గఢ్, మణిపూర్, త్రిపుర, కర్ణాటక రాష్ర్టాల్లో ఈ పథకం పేరిట జరిగిన పలు అక్రమాలు తమ దృష్టికి వచ్చాయని ఎన్ఎల్ఎం తన నివేదికలో పేర్కొంది.