న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ భర్త, పిల్లలకు చెందిన కంపెనీకే గోవాలోని వివాదాస్పద ‘సిల్లీ సోల్స్’ రెస్టారెంట్ అండ్ బార్కు లైసెన్స్ ఇచ్చినట్టు స్పష్టమైంది. అక్కడి ఓ ఇంట్లో ఈ బార్ను నడుపుతున్నారు. దీని విషయంలో తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ పలువురిపై స్మృతీ ఇరానీ పరువు నష్టం దావా వేశారు.
తమకు ఆ బార్తో ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. అయితే తాజాగా న్యాయవాది ఎయిర్స్ రోడ్రిగ్స్ ఆర్టీఐ దరఖాస్తు చేశారు. సిల్లీ సోల్స్ ఆహార లైసెన్స్ను ఎయిటాల్ ఫుడ్ అండ్ బేవరేజెస్ లిమిటెడ్ కంపెనీ పేరిట ఇచ్చినట్టు గోవా ప్రభుత్వం తెలిపింది. ఈ కంపెనీ స్మృతి ఇరానీ భర్త, కుటుంబసభ్యుల పేరిట ఉన్నది. వారికి ఇందులో 75 శాతం వాటా ఉన్నది. ఎయిటాల్ కంపెనీకి లైసెన్స్ జారీ చేయగా, అదే లైసెన్స్ను సిల్లీ సోల్స్కు వాడుతున్నారు.