X Subscription | న్యూఢిల్లీ, అక్టోబర్ 18: ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విట్టర్)లో ఖాతా కొనసాగించటం ఇకపై ఉచితం కాబోదు! ఏటా 1 డాలర్తో బేసిక్ సబ్స్క్రిప్షన్ను తీసుకొస్తున్నట్టు ‘ఎక్స్’ మంగళవారం కీలక ప్రకటన చేసింది. బేసిక్ ఫీచర్లున్న ఈ మోడల్ను ప్రస్తుతానికి న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్లలో అమలుజేయబోతున్నట్టు కంపెనీ తెలిపింది. నకిలీ ఖాతాలను అరికట్టడం కోసమే కొత్త సబ్స్క్రిప్షన్ మోడల్ను ప్రవేశపెట్టామని కంపెనీ యజమాని ఎలాన్ మస్క్ ‘ఎక్స్’లో సందేశాన్ని పోస్ట్ చేశారు.
సబ్స్క్రిప్షన్ చార్జీలు దేశాన్ని బట్టి మారుతాయని కంపెనీ వివరించింది. తాజా నిర్ణ యం ప్రకారం, కొత్తగా ఎక్స్ ఖాతా తెరిచే యూజర్లు ఏడాదికి ఒక డాలర్ చెల్లించాల్సి ఉంటుంది. ఇతరుల సందేశాలను రీపోస్ట్ చేయడం, లైక్ చేయడం, బుక్మార్క్ చేయ డం.. మొదలైన బేసిక్ ఫీచర్లకు ఈ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఖాతా తెరిచి పోస్టులను చదవడం, ఫొటో లు, వీడియోలు చూడ్డానికి ప్రస్తుతానికి రుసుము అవసరం లేదు. తాజా నిర్ణయం ఇప్పటికే ఖాతా కలిగి ఉన్న నెటిజన్లపై ప్రభావం ఉండబోదని కంపెనీ స్పష్టం చేసింది.