Terrorists attack | కశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. వరుసగా మూడోరోజు కాల్పులకు తెగబడ్డారు. బారాముల్లాలో మంగళవారం పోలీస్ హెడ్కానిస్టేబుల్ గులా మహ్మద్దార్పై ఇంటి వద్దనే కాల్పులకు పాల్పడ్డారు. ఆ తర్వాత సంఘటనా స్థలం నుంచి పరారయ్యారు. తూటాలతో గాయాలకు గురైన హెడ్ కానిస్టేబుల్ను స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఇంతకు ముందు 48 గంటల్లో ఉగ్రవాదులు రెండు ఘటనల్లో కాల్పులతో బీభత్సం సృష్టించాయి. ఈ నెల 29న పుల్వామాలో ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ కార్మికుడు కాల్చి చంపారు.
30న శ్రీనగర్లో క్రికెట్ ఆడుతున్న పోలీస్ ఇన్స్పెక్టర్ మస్రూర్ అహ్మద్ వానీపై కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కార్యకలాపాల నేపథ్యంలో కశ్మీర్లోని జిల్లాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలు, పాదచారులను సోదాలు చేస్తున్నారు. లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డట్లుగా పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఘటనాస్థలనికి చేరుకున్న ఉన్నతాధికారులు సమాచారం సేకరించారు. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. పలుచోట్ల భద్రతా బలగాలు, పోలీసులు బృందంగా ఏర్పడి సోదాలు నిర్వహిస్తున్నారు.