Terrorists Attack – Poonch | దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదులు మళ్లీ చెలరేగారు. శుక్రవారం సాయంత్రం జమ్ముకశ్మీర్లోని పూంచ్ జిల్లా ఖనేటర్ ప్రాంతంలో వెళుతున్న భారత ఆర్మీ కాన్వాయ్పై రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాన్వాయ్లో సంబంధిత కమాండ్ ఆఫీసర్ వెహికల్ కూడా ఉంది. దారాధుల్లియా ఖ్వాడియా ప్రాంత ఆర్మీ కాన్వాయ్, లోకల్ రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్ కమాండ్ ఆఫీసర్ కూడా ఈ కాన్వాయ్లో ఉన్నట్లు తెలుస్తోంది.
భారత ఆర్మీ వాహనంపై జరిగిన దాడి కొనసాగింపుగా ఈ ఉగ్రదాడి జరిగినట్లు తెలుస్తోంది. దారాధుల్లియాన్ క్వాడియా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న అనుమానంతో భద్రతా బలగాలు గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతోపాటు ఈ ప్రాంతంలో గాలింపు తీవ్రతరం చేశారు. ఈ ఘటన సాయంత్రం 6.20 గంటలకు జరిగినట్లు తెలుస్తున్నది.
ఉగ్రదాడి నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఇతర భద్రతా బలగాలతో కలిసి సామూహిక తనిఖీలు చేపట్టారు. రాజౌరీ, పూంజ్ జిల్లాల్లో ఉగ్రవాదుల శిబరాలను నిర్మూలించాలని అంతకుముందు జరిగిన భద్రతా బలగాల సమావేశంలో నార్త్రర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది చెప్పారు. ఈ సమావేశం ముగిసిన కొద్ది సేపటికే ఉగ్రదాడి జరుగడం గమనార్హం.