శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని రాజౌరి జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఓ ముష్కరుడు (Terrorist) హతమయ్యాడు. రాజౌరీ జిల్లాలోని (Rajouri district) బరియామా ప్రాంతంలో భద్రతా దళాలు, స్థానిక పోలీసులు సంయుక్తంగా టెర్రరిస్టుల కోసం గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున గాలింపు బృందాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ప్రతిగా భద్రదా దళాలు జరిపిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడని జమ్ము ఏడీజీపీ ముకేష్ సింగ్ (ADGP Mukesh Singh) చెప్పారు.
ప్రస్తుతం ఖవాస్ ప్రాంతంలో (Khawas area) ఎన్కౌంటర్ కొనసాగుతున్నదని వెల్లడించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారని, ఇప్పటివరకు ఓ ఉగ్రవాది మరణించాడని తెలిపారు. అతడు ఏ సంస్థకు చెందినవాడనే విషయాన్ని గుర్తించాల్సి ఉందన్నారు. కాగా, శుక్రవారం దక్షిణ కశ్మీర్లోని కుల్గాం జిల్లాలో ఉన్న హలన్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. దీంతో జమ్ముకశ్మీర్ అంతటా హై అలర్ట్ కొనసాగుతున్నది. టెర్రరిస్టుల కోసం ఆర్మీ జల్లెడ పడుతున్నది.