న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: పాకిస్థాన్ హస్తమున్న ఉగ్ర కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. పాక్-ఐఎస్ఐ శిక్షణ పొందిన ఇద్దరు ఉగ్రవాదులతో పాటు ఆరుగుర్ని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో ఓ స్థావరం నుంచి ఆర్డీఎక్స్తో తయారుచేసిన శక్తిమంతమైన పేలుడు పదార్థాలను (ఐఈడీ) స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ, మహారాష్ట్ర, యూపీలో నవరాత్రి ఉత్సవాలు, రామ్ లీలా సందర్భంగా భారీ దాడులు చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్టు పోలీసులు తెలిపారు. ఉగ్ర కుట్రను భగ్నం చేసేందుకు ఆయా రాష్ర్టాల్లో పోలీసుల ఆపరేషన్ సాగింది. అరెస్ట్ చేసిన వ్యక్తులను జాన్ మహమ్మద్ షేక్ అలియాస్ సమీర్ (47), ఒసామా (22), మూల్చంద్ (47), జీషన్ (28), మహమ్మద్ అబూ బకర్ (23), మహమ్మద్ అమీర్ జావెద్ (31)గా గుర్తించారు. ఒసామా, జీషన్లు పాక్లో శిక్షణ పొందారు. వీరిద్దరూ పాక్కు చెందిన ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ఆదేశాల ప్రకారం పనిచేస్తున్నారు. సమీర్… అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీమ్ సోదరుడు అనీస్ ఇబ్రహీంకు సన్నిహితుడు. ఐఈడీతో పాటు ఆయుధాలు, గ్రనేడ్లను వేర్వేరు చోట్లకు అందజేయాలని సమీర్కు అనీస్ నుంచి ఆదేశాలు అందినట్టు పోలీసులు భావిస్తున్నారు.