న్యూఢిల్లీ: వివాహాన్ని సాకుగా చూపి మహిళా ఉద్యోగిని సర్వీస్ నుంచి తొలగించటం వివక్షాపూరితమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. లింగ వివక్ష చూపే ఏ చట్టమైనా రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. బాధితురాలికి 60 లక్షల నష్టపరిహారం చెల్లించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఆర్మీలో నర్స్గా పనిచేస్తున్న సెలీనాజాన్ వివాహం చేసుకుందన్న కారణంగా 1988లో ప్రభుత్వం ఉద్యోగం నుంచి తొలగించింది. దీనిపై బాధితురాలు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ట్రిబ్యునల్ను సంప్రదించాల్సిందిగా హైకోర్టు సూచించింది. దీంతో సెలీనా సాయుధ దళాల ట్రిబ్యునల్ను ఆశ్రయించింది. కేసు విచారించిన ట్రిబ్యునల్ ఆమెను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని తీర్పునిచ్చింది. దీనిని సవాల్ చేస్తూ కేంద్రం సుప్రీంకు వెళ్లడంతో తాజా తీర్పు వెలువడింది.