కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతపై కాల్పులు జరిపి హత్య చేశారు. (Trinamool Leader Shot Dead) ఈ నేపథ్యంలో టీఎంసీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఒక అనుమానిత వ్యక్తిని కొట్టి చంపారు. పలు ఇళ్లకు నిప్పుపెట్టారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాస్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సోమవారం ఉదయం జాయ్నగర్లో ఇంటి బయట ఉన్న టీఎంసీ నాయకుడు సైఫుద్దీన్ లస్కర్పై కాల్పులు జరిపి చంపారు. బముంగాచి ప్రాంత తృణమూల్ విభాగానికి ఆయన నాయకత్వం వహిస్తుండగా, అతడి భార్య సర్పంచ్గా ఉన్నారు.
కాగా, టీఎంసీ నాయకుడు లస్కర్పై కాల్పులు జరిపి చంపడంపై ఆయన అనుచరులు చెలరేగిపోయారు. ఒక అనుమానిత వ్యక్తిని పట్టుకుని దారుణంగా కొట్టి చంపారు. అలాగే ఆ ప్రాతంలోని పలు ఇళ్లకు నిప్పుపెట్టారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
మరోవైపు టీఎంసీ నాయకుడు సైఫుద్దీన్ లస్కర్ హత్యకు సీపీఎం కార్యకర్తలు కారణమని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. అయితే సీపీఎం నేత సుజన్ చక్రవర్తి దీనిని ఖండించారు. లస్కర్ హత్యకు టీఎంసీలో అంతర్గత పోరు కారణమని విమర్శించారు. కాగా, టీఎంసీ నేత హత్యకు సంబంధించి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.