చంఢీఘడ్: పంజాబ్లో ఇవాళ పది మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రులందరూ పంజాబీలో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో హర్పాల్ సింగ్ చీమా, హర్భజన్ సింగ్, డాక్టర్ విజయ్ సింఘాలా, లాల్ చాంద్, గుర్మీత్ సింగ్ మీట్ హేయర్, కుల్దీప్ సింగ్ ధాలివాల్, లాల్జిత్ సింగ్ భుల్లార్, బ్రామ్ శంకర్ జింపా, హర్జోత్ సింగ్ బెయిన్స్, డాక్టర్ బల్జీత్ కౌర్లు ఉన్నారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 92 సీట్లతో క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్ర సీఎంగా భగవంత్ మాన్ సింగ్ బాధ్యతలు చేపట్టారు. ఇవాళ జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.