బెంగళూరు: ఒకవైపు సమాజం సాంకేతిక వైపు పరుగులు తీస్తుండగా, మరోవైపు కుల వివక్ష, అంటరానితనం వంటి సామాజిక దురాచారాలు కొన్ని ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతున్నాయి. తక్కువ కులానికి చెందిన వరుడి పూజను అడ్డుకునేందుకు స్థానిక గుడి, అక్కడి షాపులను మూసివేశారు. బీజేపీ పాలిత కర్ణాటకలోని గడగ్ జిల్లాలో ఈ కుల వివక్ష వెలుగులోకి వచ్చింది. గడగ్ పట్టణానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్యాగోటి గ్రామంలో మంగళవారం ఈ సంఘటన జరిగింది. తక్కువ కులానికి చెందిన రైతు శరణు మదార్కు పెళ్లి నిశ్చయమైంది. ఈ నేపథ్యంలో వివాహానికి ముందు పాటించే ఆచారాల్లో భాగంగా ఆ వరుడు స్థానిక గుడిలో పూజలు చేసేందుకు తన కుటుంబ సభ్యులతో కలిసి బయలుదేరాడు. అయితే ఈ విషయం తెలుసుకుని గుడి వద్ద ఉన్న షాపులన్నింటిని మూసివేశారు. అలాగే ఉదయం తెరిచిన ద్యామవ్వ గుడిని కూడా వెంటనే మూసివేశారు.
కాగా, గ్రామంలోని అగ్రవర్ణాల వారి ఒత్తిడితో గుడితో పాటు గుడి వద్ద ఉన్న షాపులను కూడా మూసివేసినట్లు వరుడు శరణు మదార్ కుటుంబం ఆరోపించింది. పెళ్లికి కావాల్సిన వస్తువులు అమ్మిన కొన్ని షాపుల వ్యాపారులకు రూ.2,500 జరిమానా విధించినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. వివాహానికి ముందు గుడిలో పూజలు చేయకుండా తమను అడ్డుకునేందుకు అగ్రవర్ణాల వారు ఇలా చేసినట్లు మండిపడ్డారు. దీంతో ఆ గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి.
మరోవైపు ఇరు వర్గాలకు నచ్చజెప్పేందుకు ఎమ్మార్వో ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆ గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. అలాగే సామాజిక సమానత్వంపై గ్రామస్తులకు అవగాహన కల్పించేందుకు అధికారుల బృందాన్ని ఏర్పాటు చేశారు. గ్రామంలో ఈ సామాజిక దురాచారాన్ని తొలగించేందుకు కఠిన నిబంధనలు అమలు చేస్తామని ఎమ్మార్వో తెలిపారు.