జైసల్మేర్: భారత్-పాకిస్థాన్ సరిహద్దు సమీపంలో సోమవారం ఉదయం అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ తెలంగాణ యువకుడిని నిర్బంధించిన స్థానికులు బీఎస్ఎఫ్ సిబ్బందికి అప్పగించారు. రాజస్థాన్లోని మ్యాజలార్ ప్రాంతానికి చెందిన గుంజన్గఢ్ గ్రామ సమీపంలో సరిహద్దుల వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని స్థానికులు అడ్డుకుని ప్రశ్నించారు. ఆ వ్యక్తి ఇచ్చిన జవాబులు సంతృప్తికరంగా లేకపోవడంతో అతడిని బీఎస్ఎఫ్ సిబ్బందికి అప్పగించినట్లు స్థానిక వర్గాలు తెలిపాయి. ఆ వ్యక్తిని తెలంగాణకు చెందిన 38 ఏండ్ల మహ్మద్ అష్ఫాఖ్ హుస్సేన్గా గుర్తించారు.
అతని వద్ద నుంచి భారతీయ పాస్పోర్టును భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. వేరే రాష్ర్టానికి చెందిన వ్యక్తి సున్నితమైన సరిహద్దు ప్రాంతంలోకి అనధికారికంగా ప్రవేశించడాన్ని భద్రతా సంస్థలు తీవ్రంగా పరిగణిస్తాయి. సరిహద్దు సమీపంలో సంచరిస్తున్న ఈ వ్యక్తి గురించి భద్రతా సిబ్బంది ఆరా తీస్తున్నారు. తెలంగాణ నుంచి జైసల్మేర్ లాంటి మారుమూల సరిహద్దు ప్రాంతానికి ప్రయాణించడానికి దారితీసిన పరిస్థితుల గురించి ప్రశ్నిస్తున్నారు. స్థానికులతో ఏమైనా పరిచయాలున్నాయా, లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న విషయాలను అడుగుతున్నారు. దీనిపై స్థానిక పోలీసుల నుంచి అధికారిక ప్రకటన ఏదీ ఇప్పటివరకు వెలువడలేదు. ఆ వ్యక్తిని అధికారికంగా అరెస్టు చేసిందీ లేనిదీ కూడా తెలియరాలేదు.