పాట్నా: బీహార్కు చెందిన రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) ఆ రాష్ట్రంలో అతి పెద్ద పార్టీగా రాణించింది. బీజేపీ కంటే ముగ్గురు ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారు. దీంతో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఆ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పవచ్చన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జేడీ(యూ) చీఫ్ నితీశ్ కుమార్ సీఎంగా ఆ పార్టీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీలో గుబులు పట్టుకుంది.
2020లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాలకుగాను ఆర్జేడీ 75 స్థానాల్లో గెలిచింది. అత్యధిక ఎమ్మెల్యేలున్న సింగిల్ పార్టీగా రాణించింది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసే సంఖ్యా బలం ఆర్జేడీకి లేకపోవడంతో బీజేపీ చక్రం తప్పింది. 74 సీట్లు గెలిచిన బీజేపీ 43 స్థానాలకే పరిమితమైన జేడీ(యూ) చీఫ్ నితీశ్ కుమార్ సీఎంగా ఆ పార్టీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరోవైపు ఆర్జేడీ కూటమితో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ కేవలం 19 సీట్లు మాత్రమే గెలుచుకుంది.
కాగా, కొన్ని నెలల కిందట తొలగించిన మంత్రి ముఖేష్ సాహ్నికి చెందిన వికాశీల్ ఇన్సాన్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. దీంతో ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 77కు పెరిగింది. అయితే ఇటీవల జరిగి ఉప ఎన్నికల్లో ఆర్జేడీ మరో అసెంబ్లీ స్థానాన్ని కైవశం చేసుకుంది. అలాగే ఏఐఎంఐఎంకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు బుధవారం ఆర్జేడీలో చేరారు. దీంతో ఆర్జేడీ ఎమ్మెల్యే సంఖ్య తాజాగా 80కి పెరిగింది. బీహార్లో అధికారంలో ఉన్న బీజేపీ కంటే ముగ్గురు ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారు.
మరోవైపు ప్రస్తుతం 45 మంది ఎమ్మెల్యేలున్న జేడీ(యూ)- బీజేపీ సర్కార్లో విభేదాలు బయటపడుతున్నాయి. ఈ తరుణంలో బీహార్లో అతి పెద్ద పార్టీగా రాణించిన ఆర్జేడీ, ప్రభుత్వం ఏర్పాటుపై దృష్టి పెట్టినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ‘అన్ని లౌకిక శక్తులు ఏకతాటిపైకి వచ్చి బలపడాలని మేం కోరుకుంటున్నాం’ అని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తాజాగా పిలుపునిచ్చారు. మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడతామన్న ఆయన వ్యాఖ్యలతో బీహార్లోని అధికార బీజేపీలో గుబులు పట్టుకుంది.