Tejashwi Yadav : బిహార్ సీఎం నితీష్ కుమార్ తరచూ కూటముల మధ్య దోబూచులాటతో రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొందని బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ విమర్శించారు. 2020లో బిహార్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం నితీష్ కుమార్ ఇప్పటికి మూడు సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారని గుర్తుచేశారు.
తరచూ కూటముల మార్పుతో బిహార్లో రాజకీయ అనిశ్చితి ఏర్పడిందని తేజస్వి యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. ముజఫర్పూర్లోని సక్త్రిలో జన్ విశ్వాస్ యాత్రలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. నితీష్ కుమార్కు సరైన విజన్ కొరవడిందని, ఆయన తరచూ రాజకీయ ఎత్తుగడలు మార్చి కూటములను ఏమార్చే క్రమంలో బిహార్ అభివృద్ధి అవకాశాలు దెబ్బతింటున్నాయని మండిపడ్డారు.
భవిష్యత్లో నితీష్ కుమార్ మళ్లీ ప్లేటు ఫిరాయించరని ప్రధాని మోదీ గ్యారంటీ ఇవ్వగలరా అని తేజస్వి యాదవ్ ప్రశ్నించారు. ఇదే నరేంద్ర మోదీ గతంలో నితీష్ కుమార్ డీఎన్ఏను ప్రశ్నించారని అన్నారు. మతపరమైన అంశాలతో రాజకీయ లబ్ధి పొందే బీజేపీ అసత్యల పార్టీ అని ఎద్దేవా చేశారు. మతంపై రాజకీయాలు నడిపే వారు ప్రస్తుతం ఉద్యోగాలు, ఉపాధి గురించి మాట్లాడుతున్నారని ఆక్షేపించారు.
Read More :
America | అమెరికాలో కోతుల కోసం మినీ సిటీ.. ఎందుకో తెలుసా?