న్యూఢిల్లీ: బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్(Tejashwi Yadav)కు చెందిన ఢిల్లీ నివాసంలో ఇవాళ ఈడీ(ED) అధికారులు సోదాలు నిర్వహించారు. ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్(Land For Jobs Scam)లో ఆ తనిఖీలు జరిగాయి. కొన్ని రోజుల క్రితమే ఈ కేసుతో లింకు ఉన్న బీహార్ మాజీ సీఎం రబ్రీదేవి(Rabri Devi) నివాసంలో సీబీఐ దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. లాలూ ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీ మనీల్యాండరింగ్కు పాల్పడిందని, ఈ కేసుతో లింకున్న 15 ప్రదేశాల్లో ఇవాళ ఈడీ సోదాలు నిర్వహిస్తున్నది.
మార్చి ఏడో తేదీన మాజీ కేంద్ర మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav) ను కూడా సీబీఐ విచారించింది. కుమార్తె మీసా భారతి(Misa Bharti) ఇంట్లో ఉంటున్న లాలూను సుమారు అయిదు గంటల పాటు ప్రశ్నించారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్(Kidney Transplantation) చేయించుకున్న లాలూ ప్రస్తుతం తన కూతురు ఇంట్లో ఉంటున్నారు. రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఉద్యోగాలు ఇప్పించి అతి తక్కువ ధరకే భూముల్ని కొనుగోలు చేసినట్లు లాలూపై ఆరోపణలు ఉన్నాయి.