పాట్నా, ఫిబ్రవరి 18: బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సోదాలపై బీహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తీవ్రంగా స్పందించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని, మహాత్మాగాంధీ దేశంగా ఉన్న భారత్ను గాడ్సే దేశంగా మార్చాలని అనుకొంటున్నదని మండిపడ్డారు. తమకు వ్యతిరేకంగా మాట్లాడితే దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తామని బెదిరించేలా కేంద్రం వైఖరి ఉన్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు హిందూ రాజ్యం గురించి మాట్లాడుతున్నారని, అయితే మన దేశ వైవిధ్యమే దేశానికి అందం అని తేజస్వీ యాదవ్ పేర్కొన్నారు.