ఎవరి జీవితాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో ఎవరూ ఊహించలేరు. చాలా మంది ఎంతో ప్రేమతో కొన్ని రంగాల్లో ప్రవేశిస్తారు. కానీ ఏమీ చెయ్యలేక మరో రంగంలో అడుగు వేసి, ఎవరూ అందుకోలేనంత ఎత్తుకు ఎదుగుతారు. తాజాగా బిహార్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ది కూడా అదే కథ. 2015లో కూడా డిప్యూటీ సీఎం కుర్చీలో కూర్చున్న అనుభవం తేజస్వి యాదవ్కు ఉంది.
అయితే ఆయన కెరీర్ ప్రారంభమైంది పాలిటిక్స్లో కాదు. భారతీయులు పిచ్చిగా అభిమానించే క్రికెట్లో. తేజస్వికి కూడా చిన్నతనం నుంచి క్రికెట్ అంటే ప్రాణం. అందుకే తను కూడా క్రికెటర్ అవడం కోసం చాలా కష్టపడ్డారు. అన్నీ కుదిరితే ప్రస్తుతం హార్దిక్ పాండ్యాతో ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ స్థానం కోసం పోటీ పడేవారు కూడా. కానీ క్రికెట్లో ఆయన కెరీర్ ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు. దాంతో రాజకీయ రంగ ప్రవేశం చేసి రాణిస్తున్నారు. మరి క్రికెట్లో ఆయన జర్నీ ఎలా ముగిసిందో ఒకసారి పరిశీలిస్తే..
చిన్నతనం నుంచే క్రికెట్ అంటే ఇష్టం ఉన్న తేజస్వి.. అప్పట్లో సీనియర్ కోచ్ అయిన ఎంపీ సింహ్ వద్ద శిక్షణ తీసుకున్నారు. ఆయన ఒకసారి టీవీ ఇంటర్వ్యూ ఇస్తూ.. తేజస్వికి క్రికెట్ అంటే చాలా ఇష్టమని, అదే సమయంలో తన తోటి క్రీడాకారుల గురించి కూడా ఆలోచిస్తారని చెప్పారు. దీనికి ఉదాహరణ ఇస్తూ.. మ్యాచ్ జరిగే సమయంలో తేజస్వి తన సెక్యూరిటీ గార్డులను మైదానానికి దూరంగా ఉంచేవారని గుర్తుచేసుకున్నారు. ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడైన తేజస్వికి చిన్నతనం నుంచే సెక్యూరిటీ ఉండేది మరి.
క్రికెట్ అంటే అంత ప్రేమ ఉన్నప్పటికీ తన కెరీర్లో తేజస్వి కేవలం ఏడు మ్యాచులే ఆడగలిగారు. వీటిలో ఒకటి రంజీ మ్యాచ్ కాగా.. రెండు లిస్ట్ ఏ మ్యాచులు, మూడు టీ20లు ఉన్నాయి. మొత్తం కెరీర్లో 37 పరుగులు చేసిన తేజస్వి.. ఒక వికెట్ తీసుకున్నారు. 2009లో క్రికెట్ కెరీర్ ప్రారంభించిన ఆయన.. జార్ఖండ్ తరఫున త్రిపురతో జరిగిన టీ20 మ్యాచ్లో ఆడారు. ఆల్రౌండర్ అయిన తేజస్వికి ఈ మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్ రెండూ చేసే అవకాశం రాలేదు. ఆ తర్వాత 2009 నవంబరు 10న విదర్భతో జరిగిన రంజీ మ్యాచ్లో ఆడారు. తొలి ఇన్నింగ్స్లో ఒక పరుగు మాత్రమే చేసిన తేజస్వి.. రెండో ఇన్నింగ్స్లో 19 పరుగులు చేశారు. ఆ తర్వాత 2010 ఫిబ్రవరి 14న ఒడిశాతో తన తొలి లిస్ట్-ఏ మ్యాచ్ ఆడారు.
ఐపీఎల్లోనూ ఆడిన తేజస్వి..
కేవలం దేశవాళీలే కాదు. అత్యంత పాపులర్ క్రికెట్ లీగ్ ఐపీఎల్లో కూడా తేజస్వి యాదవ్ అవకాశం దక్కించుకున్నారు. అప్పట్లో ఢిల్లీ డేర్డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్) యాజమాన్యం ఆయన్ను వేలంలో కొనుగోలు చేసింది. 2008 నుంచి 2012 వరకు నాలుగేళ్లు ఆ జట్టుతోనే ఉన్నప్పటికీ.. ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా తేజస్వికి రాలేదు. ఇదే విషయమై అప్పటి బిహార్ సీఎం లాలూ ప్రసాద్ను ప్రశ్నిస్తే.. ‘‘కనీసం నా కొడుకు మిగతా ప్లేయర్లకు మంచినీళ్లు అందిస్తున్నాడు కదా’’ అని జోక్ చేశారు.
కోహ్లీతో కలిసి ఆడిన అనుభవం..
భారత క్రికెట్లో అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా పేరొందిన విరాట్ కోహ్లీ కూడా.. తేజస్వితో కలిసి ఆడిన ఆటగాడే కావడం గమనార్హం. ఢిల్లీ తరఫున అండర్-17, అండర్-19 జట్లలో తేజస్వి ఆడారు. ఈ సమయంలోనే విరాట్, తేజస్వి కలిసి మైదానంలో దిగేవారు. అండర్-15 విభాగంలో కోహ్లీ ఉన్న జట్టుకు తేజస్వి కెప్టెన్గా వ్యవహరించినట్లు కూడా కొందరు చెప్తారు.
ప్రపంచకప్ గెలిచిన జట్టులో స్థానం జస్ట్ మిస్..
అంతేకాదు, 2008లో అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో కూడా తేజస్వికి అవకాశం దక్కాల్సింది. కానీ అది త్రుటిలో మిస్ అవడంతో.. స్టాండ్ బైగా ఉంచిన ఆటగాళ్లలో మిగిలిపోయారు. ఆ సంవత్సరం కోహ్లీ సారధ్యంలోని భారత యువజట్టు.. ప్రపంచకప్ గెలిచిన సంగతి తెలిసిందే.
అప్పట్లో మిడిలార్డర్ బ్యాటర్గా ఆడే తేజస్వి.. కవర్డ్రైవ్స్ అద్భుతంగా ఆడతాడని పేరుండేది. ఇప్పుడు అవన్నీ వదిలేసి రాజకీయాల్లో కవర్ డ్రైవ్స్ ఆడేస్తున్నారు. కొంతకాలం క్రితం వరకు యువకుడని, రాజకీయాల్లో అనుభవం లేని వాడని విమర్శించిన వాళ్లే.. ఇప్పుడు తేజస్వి నాయకత్వ ప్రతిభను గమనించి నోరెళ్లబెడుతున్నారు. బీజేపీ వంటి జాతీయ పార్టీలకు కూడా కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాడు.