Tejashwi Yadav: బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్కుమార్పై ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్డీఏ కూటమిని వీడబోనంటూ తాజాగా నితీశ్ చేసిన వాగ్ధానంపై తేజస్వి సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఆల్ ది బెస్ట్.. ఈ సారైనా మాట మీద నిలబడండి అంటూ సలహా ఇచ్చారు.
‘మీకు (నితీశ్ కుమార్ను ఉద్దేశించి) ఆల్ ది బెస్ట్. ప్రస్తుతం ఉన్న కూటమిలోనే శాశ్వతంగా ఉంటానని మీరు అన్నారు. ఈ సారైనా మీరు మాటకు కట్టుబడి ఉండండి’ అని తేజస్వి యాదవ్ వ్యాఖ్యానించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీహార్కు వచ్చిన ప్రధాని మోదీతో కలిసి నితీశ్ బహిరంగ సభలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన నితీశ్ కుమార్.. తాను ఇకపై కూటమి మారబోనని చెప్పారు. శాశ్వతంగా ఎన్డీఏలోనే ఉంటానని ప్రధాని సాక్షిగా వాగ్ధానం చేశారు. ఇండియా కూటమిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో నితీశ్ హామీపై తేజస్వీ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. నితీశ్ తరచూ కూటములు మారుస్తూ వాగ్ధానాలు చేస్తుండటంతో ఈ సారైనా మాటకు కట్టుబడాలని సలహా ఇచ్చారు.