చండీగఢ్: ఇంట్లో పని చేసే 13 ఏళ్ల బాలికను యజమానులు చిత్రహింసలకు గురి చేశారు. ఆమెను దారుణంగా కొట్టడంతోపాటు కుక్కతో కరిపించారు. యజమానురాలి కుమారులు బలవంతంగా బట్టలు విప్పించి నగ్న ఫొటోలు, వీడియోలు తీసి లైంగికంగా వేధించారు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన హర్యానాలోని గురుగ్రామ్లో ఈ సంఘటన జరిగింది. బీహార్కు చెందిన ఒక మహిళ జూన్లో 13 ఏళ్ల కుమార్తెను ఒక ఇంట్లో పనికి కుదిర్చింది. వాహనాలు కడిగే పని కోసం నెలకు రూ.9,000 జీతానికి కాంట్రాక్ట్ ఉద్యోగం ఇప్పించే వ్యక్తితో ఒప్పందం చేసుకుంది. వసతి కూడా కల్పించడంతో పని చేసే ఇంట్లోనే ఆ బాలిక ఉంటున్నది.
కాగా, ఇంటి యజమానురాలు, ఆమె కుమారులు ఆ బాలిక పట్ల దారుణంగా ప్రవర్తించారు. ఇనుప రాడ్లతో కొట్టారు. కుక్కతో కరిపించారు. యజమానురాలి కుమారులు ఆ బాలికతో బలవంతంగా బట్టలు విప్పించి నగ్న ఫొటోలు, వీడియోలు తీశారు. ఆమెను అసభ్యకరంగా తాకేవారు. ఆ బాలికను గదిలో బంధించేవారు. రెండు రోజులకు ఒకసారి ఆహారం పెట్టేవారు. ఆ తర్వాత నోటికి టేప్ వేసేవారు. బాలిక చేతిపై యాసిడ్ కూడా పోశారు. వీటి గురించి ఎవరికైనా చెబితే దారుణ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమెను బెదిరించారు.
మరోవైపు కుమార్తెను చిత్రహింసలకు గురి చేసిన విషయం ఆమె తల్లికి తెలిసింది. దీంతో శనివారం ఆ ఇంటి నుంచి తీసుకెళ్లిన ఆమె దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేవలం రెండు నెలలు మాత్రమే జీతం చెల్లించిన ఆ ఇంటి వారు తన కుమార్తెను దారుణంగా హింసించినట్లు ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఇంటి యజమానురాలు, ఆమె ఇద్దరు కుమారులపై పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.