జైపూర్: ఒక యువతి విమానాశ్రయంలో హల్చల్ చేసింది. పాకిస్థాన్ వెళ్లేందుకు టికెట్ ఇవ్వాలని కౌంటర్లో అడిగింది. ప్రియుడ్ని కలిసేందుకు అక్కడకు వెళ్తున్నట్టు చెప్పింది. షాకైన ఎయిర్పోర్ట్ అధికారులు ఆ యువతిని పోలీసులకు అప్పగించారు. దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది. రాజస్థాన్లో ఈ సంఘటన జరిగింది. సికర్ జిల్లాకు చెందిన ఒక యువతి శుక్రవారం జైపూర్ విమానాశ్రయానికి (Jaipur airport) చేరుకుంది. పాకిస్థాన్లోని లాహోర్కు వెళ్లేందుకు టికెట్ ఇవ్వమని కౌంటర్లో అడిగింది. తన ప్రియుడ్ని కలిసేందుకు అక్కడికి వెళ్తున్నట్టు ఆమె చెప్పింది.
కాగా, టికెట్ కౌంటర్ సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు ఇది విని షాకయ్యారు. ఆ బాలిక మైనర్ కావడం, ఆమె వద్ద పాస్పోర్ట్, వీసా లేదా ఎలాంటి పత్రాలు లేవని తెలుసుకున్నారు. దీంతో ఆమె హస్యమాడుతున్నదని వారు భావించారు. ఆ యువతిని మరిన్ని వివరాలు అడిగారు. అయితే అధికారులను నమ్మించేందుకు ఆమె ప్రయత్నించింది. పాకిస్థాన్కు ఎలా రావాలి, అధికారులను ఎలా మేనేజ్ చేయాలి అన్నది తన ప్రియుడు చెప్పినట్టు తెలిపింది.
మరోవైపు ఆ యువతి ఒక కట్టుకథ కూడా అల్లింది. మూడేళ్ల కిందట ఇస్లామాబాద్ నుంచి భారత్కు వచ్చినట్లు ఆమె తెలిపింది. రాజస్థాన్లోని బంధువుల ఇంటి వద్ద ఉంటున్న తనను వారు సరిగా చూడటం లేదని చెప్పింది. అందుకే తాను తిరిగి పాకిస్థాన్కు వెళ్తున్నట్టు వెల్లడించింది.
చివరకు ఎయిర్పోర్ట్ అధికారులు ఆ యువతిని పోలీసులకు అప్పగించారు. దీంతో వారు దర్యాప్తు చేయగా అసలు విషయం తెలిసింది. సికర్ జిల్లాలోని గ్రామానికి చెందిన యువతిగా ఆమెను గుర్తించారు. అలాగే యువతి తల్లిదండ్రులను రప్పించారు. వారి ఎదుట ఆమెను ప్రశ్నించారు. అయితే అందరి దృష్టిని ఆకట్టుకునేందుకే తాను ఇలా చేసినట్లు ఆమె చెప్పింది.