Layoffs | న్యూఢిల్లీ : టెక్ కంపెనీల్లో గత రెండేండ్ల నుంచి ఉద్యోగుల తొలగింపులు (లేఆఫ్స్) అడ్డూ అదుపూ లేకుండా కొనసాగుతున్నాయి. ఫలితంగా ఈ ఏడాది ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 2.5 లక్షల మందికిపైగా ఉద్యోగాలను కోల్పోయారు. ఇది నిరుటి కంటే 50 శాతం అధికం. అత్యధిక సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన కంపెనీల్లో గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి టెక్ దిగ్గజాలతోపాటు చిన్న చిన్న ఫిన్టెక్ స్టార్టప్లు, యాప్లు ఉన్నాయి.
నవంబర్ 11 వరకు 1,106 కంపెనీలు 2,48,974 మంది ఉద్యోగులను తొలగించాయని, నిరుడు ఇదే సమయంలో 1,54,336 మంది ఉద్యోగులు ఉద్వాసనకు గురయ్యారని ‘లేఆఫ్స్.ఎఫ్వైఐ’ వెబ్సైట్ వెల్లడించింది. గత రెండేండ్లలో సగటున గంటకు 23 మంది లేదా రోజుకు 555 మంది ఉద్యోగాలను కోల్పోయారని, ఈ ఏడాది జనవరిలోనే వివిధ కంపెనీలు 89,554 మంది ఉద్యోగులను తొలగించాయని స్పష్టం చేసింది. రిటైల్ టెక్, కన్జ్యూమర్ టెక్ రంగాల్లో ఉద్యోగుల తొలగింపు ఎక్కువగా జరిగిందని, ఈ సంవత్సరం ముగిసేలోగా మరింత మంది ఉద్యోగులపై వేటు పడటం ఖాయమని పేర్కొన్నది.