Layoffs | న్యూఢిల్లీ, మే 25: ఖర్చు తగ్గింపు ప్రణాళికలో భాగంగా టెక్ కంపెనీలన్నీ ఉద్యోగులను ఇంటికి పంపేందుకు పోటీపడ్డాయి. అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్, సేల్స్ఫోర్స్.. ఒకటేమిటి కంపెనీలన్నీ వేలాదిమందిని ఉన్న పలాన ఊడబెరికాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది ఇప్పటి వరకు దాదాపు 2 లక్షల మంది ఫుల్టైం ఉద్యోగులు, ఫ్రీలాన్సర్లు, కన్సల్టెంట్లు రోడ్డున పడ్డారు. జాబ్కట్ ట్రాకింగ్ వెబ్సైట్ ‘లేఆఫ్.ఎఫ్వైఐ’ ప్రకారం 696 కంపెనీలు ఈ ఏడాది తమ వర్క్ఫోర్స్ను తగ్గించుకోవాలని నిర్ణయించాయి. మే 18 నాటికే 1,97,985 మంది ఉద్యోగాలు కోల్పోయారు. గతేడాది 1,056 టెక్ కంపెనీలు 1,64,000 మంది ఉద్యోగులను తొలగించాయి. దాంతో పోలిస్తే ఈ ఏడాది సగం నెలలు కూడా గడవకముందే అంతకంటే ఎక్కువమంది ఉద్యోగులు నిరుద్యోగులుగా మారారు.
ఉద్యోగుల మెడపై కత్తిని వేలాడదీస్తున్న కంపెనీల జాబితాలో ఇప్పుడు మరిన్ని చేరాయి. చైనీస్ ఇంటర్నెట్ దిగ్గజం అలీబాబా క్లౌడ్ డివిజన్ తమ మొత్తం ఉద్యోగుల్లో 7 శాతం మందిని ఇంటికి పంపే ఏర్పాట్లు చేస్తోంది. గతేడాది ఆగస్టులో దాదాపు 10 వేల మందికి ఉద్వాసన పలికిన అలీబాబాలో మార్చి నాటికి 2.35 లక్షల మంది ఉద్యోగులున్నారు. డిస్నీ కూడా మూడో విడత వేటుకు సిద్ధమైంది. ఈ ప్రభావం 2,500 మందిపై పడనున్నట్టు ‘సీఎన్ఎన్’ నివేదించింది.