ముంబై: శివసేన ఎంపీలు కూడా తిరుగుబాటు చేస్తారనే భయం ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి పట్టుకుంది. దీంతో లోక్సభలో కొత్త చీఫ్ విప్ పేరును ప్రతిపాదించింది. ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ ఈ మేరకు లోక్సభ స్పీకర్కు బుధవారం లేఖ రాశారు. భావా గావ్లీ స్థానంలో రాజన్ విచారేను చీఫ్ విప్గా నియమించినట్లు అందులో పేర్కొన్నారు.
కాగా, 55 మంది ఎమ్మెల్యేలు ఉన్న శివసేనలో ఏక్నాథ్ షిండే నేతృత్వంలో 40 మంది తిరుగుబాటు చేశారు. బలనిరూపణ నేపథ్యంలో సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయడంతో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి ఏర్పాటు చేసిన మహావికాస్ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వం పడిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ మద్దతుతో సీఎం అయిన షిండే ఆ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం జరిగిన బలపరీక్షలో ఎలాంటి ఒత్తిడి లేకుండా నెగ్గారు.
మరోవైపు ఉద్ధవ్ ఠాక్రే వెంట కేవలం 15 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలి ఉన్నారు. రెండొంతుల మెజార్టీ సభ్యులు తన వెంట ఉండటంతో తామే అసలైన శివసేన అని షిండే వర్గం చెప్పుకుంటోంది. అయితే దీని కోసం ఎన్నికల కమిషన్ను ఆ వర్గం ఇంకా ఆశ్రయించలేదు. కాగా, షిండే సీఎంగా అనర్హుడని, రెబల్ ఎమ్మెల్యేల అనర్హతపై శివసేన దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరుగనున్నది.