ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గానికి సుప్రీంకోర్టు ఊరట ఇచ్చింది. శరద్ పవార్ వర్గంతో తమకు సంబంధం లేదన్న ప్రకటనతో ‘గడియారం’ చిహాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగానికి అనుమతి ఇచ్చింది. అయితే తమ ఆదేశాలను ఉల్లంఘించవద్దని సూచించింది. ఈ మేరకు హామీ ఇవ్వాలంటూ నోటీస్ జారీ చేసింది. ఒకవేళ కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్లు తమ దృష్టికి వస్తే సుమోటోగా ధిక్కార చర్యలు చేపడతామని హెచ్చరించింది. ‘ఎన్నికలు ముగిసే వరకు మా ఆదేశాలను ఉల్లంఘింబోమని తాజా హామీని మీరు (అజిత్ పవార్ వర్గం) దాఖలు చేయండి. ఇబ్బందికరమైన పరిస్థితిని మీరు సృష్టించుకోవద్దు. మా ఆర్డర్ను ఉల్లంఘించడానికి ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తున్నట్లు మేం కనుగొంటే సుమోటోగా ధిక్కార చర్యలు ప్రారంభిస్తాం’ అని ఆ నోటీస్లో సుప్రీంకోర్టు పేర్కొంది.
కాగా, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల్లో ‘గడియారం’ చిహ్నాన్ని ఉపయోగించకుండా నిరోధించాలని కోరుతూ శరద్ పవార్ వర్గం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గురువారం విచారణ సందర్భంగా శరద్ పవార్ వర్గం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ కోర్టులో వాదించారు. ఎన్సీపీతోపాటు గడియారం సింబల్పై వివాదం ఉన్నదని కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో శరద్ పవార్ వర్గంతో తమకు సంబంధం లేదన్న విషయాన్ని ఎన్నికల పోస్టర్లలో అజిత్ పవార్ వర్గం ప్రకటించలేదని ఆరోపించారు. ప్రత్యర్థి శిబిరం ఓట్లు పొందడం కోసమే శరద్ పవార్తో అనుబంధాన్ని ఆ వర్గం కోరుకుంటోందని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై తాజాగా హామీ ఇవ్వాలంటూ అజిత్ పవార్ వర్గానికి సుప్రీంకోర్టు నోటీస్ జారీ చేసింది.
మరోవైపు 2023లో అజిత్ పవార్ ఎన్సీపీలో తిరుగుబాటు చేశారు. తన వర్గంతో కలిసి మహాయుతి కూటమి ప్రభుత్వంలో చేరారు. అయితే ఆయన వర్గమే నిజమైన ఎన్సీపీ అని ఎలక్షన్ కమిషన్ (ఈసీ) స్పష్టం చేసింది. ‘గడియారం’ గుర్తును ఆ వర్గానికే కేటాయించింది. ఈ నేపథ్యంలో శరద్ పవార్ వర్గం పార్టీని ‘నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-శరద్చంద్ర పవార్’గా, తుర్హాఊదుతున్న వ్యక్తిని చిహ్నంగా వినియోగించుకోవచ్చని సుప్రీంకోర్టు సూచించింది. అయితే శరద్ పవార్ పేరు, ఫొటోలను రాజకీయ ప్రయోజనాల కోసం అజిత్ పవార్ వర్గం ఉపయోగించుకోవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.