న్యూఢిల్లీ: ఆదాయపన్ను దరఖాస్తుల్లో జరిగే పొరపాట్లను సరి చేసుకునేందుకు కేంద్రం మరో అవకాశాన్ని కల్పించింది. అయితే ఆ దరఖాస్తుకు సంబంధించిన అప్డేట్ను రెండేళ్ల తర్వాత కూడా చేసుకోవచ్చు అని సదుపాయాన్ని ఇచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇవాళ లోక్సభలో ఆమె బడ్జెట్ ప్రవేశపెడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక సహకార సంస్థలపై పన్ను శాతాన్ని 15 శాతానికి తగ్గించారు. సహకార రంగాలు, కార్పొరేట్లకు పన్ను విధానం సమంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సహకార రంగాలపై సర్చార్జీని ఏడు శాతానికి తగ్గిస్తున్నట్లు మంత్రి నిర్మల తెలిపారు. ఇక వర్చువల్ డిజిటల్ ఆస్తులపైన కూడా పన్నును 30 శాతానికి ఫిక్స్ చేశారు. డిజిటల్ ఆస్తులను ఒకవేళ ఎవరికైనా గిఫ్ట్ ఇస్తే, ఆ గిఫ్ట్ స్వీకరించిన వాళ్లు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందని మంత్రి చెప్పారు.