న్యూఢిల్లీ: రక్షణ దళాల్లో కొత్త పథకం కింద రిక్రూట్ అయ్యే అగ్నివీరులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పన్నుల్లో ఉపశమనం కల్పించారు. అగ్నివీరులు ‘అగ్నివీర్ కార్పస్ ఫండ్’ నుంచి పొందే చెల్లింపులకు ఎలాంటి పన్నులు ఉండవని ప్రకటించారు. బుధవారం పార్లమెంట్లో బడ్జెట్ సమర్పించిన ఆమె తన ప్రసంగంలో ఈ విషయాన్ని తెలిపారు. ‘సేవా నిధి ఖాతాకు అగ్నివీరులు లేదా కేంద్ర ప్రభుత్వం చెల్లించే మొత్తానికి పన్ను మినహాయింపును అనుమతించాలని ప్రతిపాదించాం’ అని సీతారామన్ పేర్కొన్నారు.
రక్షణ దళాల్లో స్వల్ప కాల కాంట్రాక్ట్ పద్ధతిలో జవాన్లను నియమించుకునే ‘అగ్నివీర్’ రిక్రూట్మెంట్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం గత ఏడాది అమలులోకి తెచ్చింది. సాయుధ దళాల్లో యువతను మరింతగా పెంచడం, కొత్త సాంకేతికతను అందిపుచ్చుకునేలా వారికి శిక్షణ ఇవ్వడం, యువత ఆరోగ్యస్థాయిలను పెంచడం ఈ స్కీమ్ ఉద్దేశమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కాగా, సాయుధ దళాల్లో కాంట్రాక్ట్ పద్ధతి నియామాలకు సంబంధించిన ‘అగ్నివీర్’ విధానంపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ కేంద్రం వెనక్కి తగ్గలేదు.