జెంషెడ్పూర్: టాటా స్టీల్ కంపెనీ అసాధారణ నిర్ణయం తీసుకున్నది. కష్టకాలంలో మానవ విలువలకు మణిహారంగా నిలిచింది. కోవిడ్తో చనిపోయిన తమ సంస్థ ఉద్యోగ కుటుంబీకులకు.. సదరు ఉద్యోగి రిటైర్మెంట్ వయసు వచ్చే వరకు ఆ ఉద్యోగి నెల జీతాన్ని కుటుంబసభ్యులకు ఇవ్వనున్నది. అంటే ఉద్యోగి 60 ఏళ్ల వయసు వరకు ఆ ఉద్యోగి కుటుంబసభ్యులకు నెల జీతం ఇవ్వనున్నారు. ఆ ఉద్యోగి చివరి సారి ఎంత జీతం తీసుకున్నాడో.. ఆ జీతాన్ని ప్రతి నెల వారి కుటుంబసభ్యులకు ఇవ్వనున్నట్లు టాటా స్టీల్ చెప్పింది. కోవిడ్తో మృతిచెందిన ఉద్యోగులకు సామాజిక భద్రత ఇవ్వడమే కాదు.. వారి కుటుంబాలకు భరోసా ఇవ్వడం కూడా ఆ కంపెనీ బాధ్యతగా తీసుకున్నది. సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన ఓ స్టేట్మెంట్ ద్వారా టాటా స్టీల్ కంపెనీ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.
ఇక కంపెనీలో పనిచేస్తున్న ఫ్రంట్లైన్ వర్కర్కు కోవిడ్ సంక్రమించి, ఆ వ్యక్తి ఒకవేళ మరణిస్తే.. ఆ ఉద్యోగి పిల్లల చదువులను మొత్తం కంపెనీ భరించనున్నది. నెల జీతానికి ఇది అదనం. పిల్లలు ఇండియాలో గ్రాడ్యుయేషన్ పూర్తి అయ్యేంత వరకు ఆ మొత్తం ఖర్చును టాటా స్టీల్ కంపెనీ పెట్టుకోనున్నది. జెంషెడ్పూర్కు చెందిన టాటా స్టీల్ కంపెనీ చేసిన ప్రకటన నెటిజన్లను ఆకట్టుకున్నది. ఆ కంపెనీపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తున్నది. టాటా స్టీల్ను అమితంగా గౌరవిస్తాని ఓ ట్విట్టర్ యూజర్ పోస్టు చేశారు. కార్పొరేట్ ప్రపంచానికి రతన్ టాటా ఓ స్పూర్తిగా నిలిచారని మరో యూజర్ ట్వీట్ చేశారు. టాటా తరహాలో మరో సంస్థ ఆలోచిందని ఒకరన్నారు. కొందరు రతన్ టాటాకు సెల్యూట్ చేస్తూ ఎమోజీలు పెట్టారు.