న్యూఢిల్లీ: నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను టాటా సన్స్ టేకోవర్ చేసుకోనున్నది. ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ కోసం సమర్పించిన బిడ్స్ను టాటా సన్స్ గెలుచుకున్నట్లు తెలుస్తోంది. అయితే కేంద్ర ఆర్థిక శాఖ త్వరలో దీనిపై తుది ప్రకటన చేయనున్నది. కేంద్ర హోంశాఖ నేతృత్వంలోని నిపుణుల బృందం టాటా సన్స్ సమర్పించిన బిడ్కు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియా సంస్థలో పెట్టుబడుల ఉపసంహరణ జరగనుంది. జాతీయ పౌర విమానయాన సంస్థ అయిన ఎయిర్ ఇండియాను అమ్మేందుకు గతంలోనూ ప్రయత్నాలు జరిగాయి.
2018 మార్చిలో కేంద్రం ఎయిర్ ఇండియాలో 76 శాతం షేర్లను అమ్మేందుకు ఇంట్రెస్ట్ చూపింది. అయితే అప్పుడు స్పందన కరువైంది. భారీ నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియా ఇక టాటా సన్స్ చేతుల్లోకి వెళ్లనున్నది. ఎయిరిండియా (Air India sale) అమ్మకం కోసం టాటా సన్స్ తో పాటు స్పైస్జెట్ ప్రమోటర్ అజయ్సింగ్ బిడ్స్ వేశారు. ఎయిర్ ఇండియా ప్రతి రోజు సుమారు 20 కోట్ల నష్టాన్ని చవిచూస్తోంది. దీంతో ఆ సంస్థ ఇప్పటి వరకు 70 వేల కోట్ల నష్టంలో ఉన్నది. దివాళా తీసిన ఎయిర్ ఇండియాను టాటా చేజిక్కించుకోవడం కొంత ఊరటనిచ్చే అంశం.