న్యూఢిల్లీ, ఆగస్టు 13: కేంద్రంలోని మోదీ సర్కారు తమ అధికార కాంక్షకు వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నది. మహారాష్ట్రలో అధికారాన్ని చేజిక్కించుకున్న విధంగానే ఇతర విపక్ష రాష్ర్టాల్లోనూ పాగా వేసేందుకు పావులు కదుపుతున్నది. ఇందుకు ఈడీ, సీబీఐ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను, గవర్నర్ వంటి రాజ్యాంగ వ్యవస్థలను వాడుకుంటున్నది. మహారాష్ట్రలో ఉద్ధవ్ సర్కారును ఇదే విధంగా కూల్చిన బీజేపీ.. ఇప్పుడు పశ్చిమబెంగాల్, కేరళ, జార్ఖండ్, ఛత్తీస్గఢ్పై దృష్టిసారించింది. ఇందులో భాగంగా ఆయా రాష్ర్టాల్లోని అధికార పార్టీ నేతలపై దర్యాప్తు సంస్థల దాడులు ఇప్పటికే ముమ్మరమయ్యాయి.
పశ్చిమబెంగాల్లో అరెస్టుల పర్వం
పశ్చిమబెంగాల్లో పాగా వేయాలని బీజేపీ ఎప్పటి నుంచో చూస్తున్నది. అయితే అక్కడ మమత బెనర్జీ బలమైన నేతగా ఉండడంతో తమకు అలవాటైన పద్ధతిలో గద్దెనెక్కేందుకు యత్నిస్తున్నది. ఇందులో భాగంగానే తృణమూల్ నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు వరుస దాడులు చేస్తున్నాయనే వార్తలు వస్తున్నాయి. పశువుల అక్రమ రవాణా కేసు అంటూ అధికార టీఎంసీ నేత అనుభ్రత మండల్ను ఈడీ గురువారం అరెస్టు చేసింది. ఇప్పటికే టీఎంసీ ఎంపీ, మమత అల్లుడు అభిషేక్ బెనర్జీతో సహా పలువురు నేతలపై దర్యాప్తు సంస్థలు కన్నేశాయి. టీచర్ రిక్రూట్మెంట్ కేసులో మంత్రిగా ఉన్న పార్థచటర్జీని ఈడీ అరెస్టు చేసింది. కోల్ స్కాం కేసులో అభిషేక్ బెనర్జీని ప్రశ్నించింది. గత ఏడాది మేలో నారదా స్కాం కేసులో ఇద్దరు మంత్రులు ఫిర్హాద్ హకీం, సుభ్రత ముఖర్జీలతో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలను సీబీఐ అరెస్టు చేసింది.
కేరళలో విజయన్ టార్గెట్గా..
అసలు ఉనికి లేని కేరళలో కూడా పాగా వేయాలని బీజేపీ చూస్తున్నది. సీఎం పినరాయి విజయన్తో పాటు పలువురు నేతలపై దృష్టి పెట్టింది. కేఐఐఎఫ్బీలో అక్రమాలు జరిగాయంటూ మాజీ ఆర్థిక మంత్రి థామస్కు ఈడీ ఇప్పటికే నోటీసులు ఇచ్చింది. కేఐఐఎఫ్బీని టార్గెట్గా చేసుకొని కేంద్రం రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తున్నదని విజయన్ మండిపడ్డారు. రెండు దశాబ్దాల నాటి ఎస్ఎన్సీ లావలిన్ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు, కేరళ హైకోర్టు విజయన్కు ఉపశమనం కలిగించినప్పటికీ, సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. గోల్డ్ స్మగ్లింగ్, లావలిన్ కేసులు ముగిశాయని విజయన్ అనుకోవద్దని కేంద్ర హోంమంత్రి అమిత్షా సన్నిహితుడు ప్రతీశ్ విశ్వనాథ్ వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకున్నది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని, కుట్రలను ప్రజామద్దతుతో అడ్డుకుంటామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బాలక్రిష్టన్ శుక్రవారం అన్నారు. కాలం చెల్లుతున్న పలు ఆర్డినెన్స్లను పొడిగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను గవర్నర్ తిరస్కరించారని పేర్కొన్నారు.
హేమంత్ సోరెన్పై పిటిషన్లు
మైనింగ్ లీజ్ టెండర్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్పై రాష్ట్ర హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ కేసులో సోరెన్పై సీబీఐ, ఈడీ చేత విచారణ చేయించాలని పిటిషన్లు కోరాయి. రాష్ట్రంలోని సోరెన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు కేంద్రం ఈడీ దాడులకు తెరలేపింది. గత నెల సోరెన్ సన్నిహితుడు పంకజ్ మిశ్రాకి చెందిన 18 ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు జరిపారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రలు పన్నుతున్నదని సోరెన్ ధ్వజమెత్తారు.