చెన్నై, మార్చి 26: తమిళ రాజకీయాలు కొత్త మలుపు తీసుకుంటున్నాయి. ఆరు దశాబ్దాలుగా ద్రవిడవాద పార్టీల మధ్యనే సాగిన రాజకీయ పోటీ ఈసారి భిన్న భావజాలాల మధ్య పోరుగా మారింది. ఇంతకాలం అయితే డీఎంకే, కాకపోతే అన్నా డీఎంకే అంటూ సాగిన తమిళనాడులో ఇప్పుడు చతుర్ముఖ పోటీ నెలకొన్నది.
తమిళనాడులో పట్టు కోసం బీజేపీ, నామ్ తమిళర్ కట్చి(ఎన్టీకే) పార్టీలు ఈసారి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటివరకు తమిళనాడులో పెరియార్ భావజాలంతో నడిచే ద్రవిడ పార్టీలే ప్రధానంగా రాజకీయ శక్తులుగా ఉండేవి. ఈసారి మాత్రం హిందుత్వం, జాతీయవాద భావజాలంతో బీజేపీ, తమిళ జాతీయవాదంతో ఎన్టీకే కూడా ప్రధాన పార్టీలుగా ఈ ఎన్నికల బరిలో నిలుస్తున్నాయి.
మూడు భావజాలాల మధ్య పోరు
తమిళనాడులో ఎన్నడూ లేని విధంగా ఈ లోక్సభ ఎన్నికల్లో మూడు భిన్న భావజాలాలతో నడిచే నాలుగు పార్టీల మధ్య పోటీ నెలకొన్నది. ఇంతకాలం ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలైనా, లోక్సభ ఎన్నికలైనా డీఎంకే, అన్నా డీఎంకే మధ్యనే పోటీ ఉండేది. ఇప్పటికీ డీఎంకే బలంగానే ఉన్నప్పటికీ అన్నా డీఎంకే మాత్రం జయలలిత మరణం, తదనంతర పరిణామాలు, పార్టీలో చీలికల కారణంగా కొంత బలహీనపడింది. దీంతో ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగేందుకు ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు బీజేపీ, ఎన్టీకే ప్రయత్నిస్తున్నాయి. ఇందులో బీజేపీ పూర్తిగా హిందూ, జాతీయవాదంతో పని చేస్తుండగా, ఎన్టీకే మాత్రం తమిళ జాతీయవాదాన్ని నమ్ముకున్నది. దీంతో నాలుగు పార్టీలు.. మూడు భావజాలాల మధ్య ఈసారి తమిళనాడులో ఎన్నికల పోరు జరుగుతున్నది.
కూటమి కట్టిన బీజేపీ
ఇప్పటివరకు తమిళనాడు రాజకీయాల్లో బీజేపీ పాత్ర చాలా పరిమితంగా ఉండేది. ఏదో ఒక కూటమిలో చిన్న పార్టీగా ఉంటూ వచ్చిన బీజేపీ మొదటిసారిగా తానే ఒక కూటమి కట్టి నడిపిస్తూ ప్రధాన పార్టీగా మారింది. అంబుమని రామదాస్ నాయకత్వంలోని పీఎంకే, దినకరన్ నాయకత్వంలోని ఏఎంఎంకే పార్టీలతో బీజేపీ జట్టుకట్టింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అన్నామలై నేతృత్వంలో ఈసారి ఎన్నికల్లో బీజేపీ కొంత దూకుడుగానే వెళ్తున్నది. కచ్చితంగా 25 శాతం ఓటు బ్యాంకును సాధించుకోవాలనే పట్టుదలతో ఆ పార్టీ ఉంది.
ఓటుబ్యాంకును పెంచుకునే యత్నంలో ఎన్టీకే
తమిళ జాతీయవాదాన్ని, వేర్పాటువాదాన్ని వినిపించే నామ్ తమిళర్ కట్చి కూడా ఈసారి బలమైన రాజకీయ శక్తిగా ఎదిగే ప్రయత్నంలో ఉంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఈ పార్టీ గెలుచుకోనప్పటికీ ఏడు శాతం ఓటు బ్యాంకును సొంతం చేసుకుంది. ఈసారి ఒంటరిగా ఎన్నికల బరిలో నిలిచింది. తమిళ వేర్పాటువాదం వైపు ఉండే ఈ పార్టీ ఓట్ల శాతాన్ని పెంచుకునే ప్రయత్నంలో ఉంది. ముఖ్యంగా ఆ పార్టీ అధినేత సీమాన్ ఆవేశపూరిత ప్రసంగాలకు జనం బాగానే ఆకర్షితులవుతున్నారు. ఆయన సభలకు జనం భారీగా హాజరవుతున్నారు.