చెన్నై: జ్యోతిష్యుడి సలహా మేరకు ఒక వ్యక్తి పాము ముందు నాలుకను బయటకు చాచాడు. ఆ పాము అతడి నాలుకపై కాటు వేసింది. గమనించిన అక్కడున్న పూజారి ఆ వ్యక్తి నాలుకను కోశాడు. దీంతో జ్యోతిష్యుడి సలహా పాటించిన ఆ వ్యక్తి ఏకంగా తన నాలుక కోల్పోయాడు. విస్తూపోయే ఈ సంఘటన తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో జరిగింది. కోపిశెట్టిపాళయంకు చెందిన 54 ఏళ్ల రాజా రైతు. అతడికి పాము కాటు వేసినట్లుగా తరచుగా కలలు వస్తున్నాయి. దీంతో రాజా ఒక జ్యోతిష్యుడ్ని కలవగా కొన్ని సలహాలిచ్చాడు. పాముల ఆలయానికి వెళ్లి పూజాలు చేయాలని సూచించాడు. అలాగే పాము ముందు దాని మాదిరిగా మూడు సార్లు నాలుకను బయటకు చాచాలని చెప్పాడు.
కాగా, జ్యోతిష్యుడి సలహాను రైతు రాజా పాటించాడు. పాముల గుడికి వెళ్లి పూజలు చేశాడు. చివర్లో ఒక పాము ముందు తన నాలుకను మూడు సార్లు బయటకు చాచాడు. అయితే ఆ విష సర్పం రాజా నాలుకపై కాటు వేసింది. అక్కడే ఉన్న పూజారి దీనిని గమనించాడు. ఆయన వెంటనే పాము కాటు వేసిన రాజా నాలుక భాగాన్ని కత్తితో కోశాడు. అనంతరం అతడ్ని ఈరోడ్ మానియన్ మెడికల్ సెంటర్కు తీసుకెళ్లాడు.
అయితే నాలుక కోయడంతో రక్తం కోల్పోయిన రాజా, ఆసుపత్రికి వెళ్లేలోపు అపస్మారక స్థితికి చేరాడు. వెంటనే స్పందించిన వైద్యులు తెగిన నాలుకకు కుట్లు వేశారు. అలాగే విష విరుగుడు ఇంజక్షన్ కూడా ఇచ్చారు. అయితే జ్యోతిష్యుడి సలహా పాటించిన ఆ రైతు తన నాలుకను కోల్పోయాడు.