CM Vijay : తమిళనాడు (Tamil Nadu) లో అధికారంలోకి వచ్చిన టీవీకే ప్రభుత్వం (TVK Govt) కీలక నిర్ణయం తీసుకుంది. గత డీఎంకే ప్రభుత్వ హయాంలో రైతులు, ఉపాధ్యాయులపై నమోదైన కేసులను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నట్లు ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) అసెంబ్లీ (Assembly) లో ప్రకటించారు. ఈ నిర్ణయం ద్వారా నిరసనకారులకు భారీ ఊరట లభించినట్లయింది. 2021 మే నుంచి 2026 మధ్య కాలంలో ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం.. సిప్కాట్ పారిశ్రామిక వాడ, పరందూర్ విమానాశ్రయం వంటి ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసనలు తెలిపిన వారిపై అమానుషంగా వ్యవహరించిందని విజయ్ విమర్శించారు.
ఆ సమయంలో రైతులు, ఉపాధ్యాయులపై పలు కేసులు నమోదు చేశారని, అవి ఇప్పటికీ పెండింగ్లో ఉండటంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజల న్యాయమైన డిమాండ్లకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని విజయ్ స్పష్టంచేశారు. కేసుల ఎత్తివేత నిర్ణయం ప్రభుత్వ పాలనపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతుందని అభిప్రాయపడ్డారు. ఇదిలాఉండగా, ‘నీట్’ కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన విద్యార్థులపై కేసులను ఉపసంహరించుకోవాలని సీపీఐ, ఎన్ఎల్సీ ఆందోళనకారులపై కేసులను రద్దు చేయాలని పీఎంకే పార్టీలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అయితే ఆ డిమాండ్లపై టీవీకే ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి స్పందన రాలేదు.