చెన్నై: తమిళనాడు ప్రజలకు 24 గంటలపాటు కరోనా టీకా వేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం నుంచి దీనిని అమలు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి మా సుబ్రహ్మణ్యం తెలిపారు. 37 జిల్లాల్లోని ఎంపిక చేసిన ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ కాలేజీల్లో 24 గంటల పాటు కరోనా టీకా వేసే ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఉద్యోగం, ఇతర పనుల నేపథ్యంలో టీకా తీసుకునేందుకు తగిన సమయం లేని వారికి ఇది ఉపయోగపడుతుందని అన్నారు. ఉద్యోగులు, ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు దీనిని వినియోగించుకోవచ్చని తెలిపారు. 24 గంటల టీకా కార్యక్రమంపై ప్రజలకు సమాచారం అందించేందుకు వాణిజ్య ప్రకటనలు ఇస్తామని చెప్పారు. అలాగే గ్రేటర్ చెన్నై పరిధిలో 80 ఏండ్లు, ఆపైన ఉన్న వృద్ధుల ఇండ్లకు సిబ్బంది వెళ్లి కరోనా టీకా వేస్తారని వెల్లడించారు.