కాంచిపురం: తమిళనాడు రాష్ట్రంలోని కాంచిపురం జిల్లాలో ఇవాళ సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు అతివేగంతో వెళ్తూ ఎదురుగా వచ్చిన ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
మృతుల్లో ఒక చిన్నారి సహా ముగ్గురు మహిళలు ఉన్నారు. మనమాయ్ గ్రామంలోని మామల్లాపురం సమీపంలోగల ఈస్ట్కోస్ట్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి, మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు.