చెన్నై: ప్రధాని మోదీని అవమానించేలా తమిళనాడు మంత్రి (Tamil Nadu Minister) వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ మండిపడింది. ఆ మంత్రికి వ్యతిరేకంగా విమర్శలు చేసింది. అలాగే ఎన్నికల సంఘం (ఈసీ)కి ఫిర్యాదు చేస్తామని పేర్కొంది. తమిళనాడు మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి అనితా రాధాకృష్ణన్, ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీని కించపరిచారు. అణగారిన వర్గం ప్రజల ఓట్ల కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్, కామరాజర్ వంటి దిగ్గజ విగ్రహాల ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారని ఆరోపించారు. ‘పటేల్ కమ్యూనిటీ ఓట్లు కోరేందుకే సర్దార్ వల్లభాయ్ పటేల్, అణగారిన ప్రజల మద్దతు కోసం కామరాజర్ విగ్రహాలను నెలకొల్పారు. ఇలాంటి అసహ్యకరమైన వ్యూహాలను ప్రధాని మోదీ అనుసరిస్తున్నారు’ అని అన్నారు.
కాగా, తమిళనాడు మంత్రి రాధాకృష్ణన్ వ్యాఖ్యలను ఆ రాష్ట్ర బీజేపీ ఖండించింది. సాధారణ కుటుంబానికి చెంది దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ప్రధాని మోదీని అవమానించడం తగదంటూ ట్వీట్ చేసింది. అలాగే వేదికపై ఉన్న డీఎంకే ఎంపీ కనిమొళి దీనిని ఖండించకపోగా ఆస్వాదించారని విమర్శించింది. వికారం కలిగించేలా మాట్లాడిన మంత్రి రాధాకృష్ణన్పై చర్యల కోసం ఈసీకి ఫిర్యాదు చేస్తామని పేర్కొంది.