కరోనా కేసులు కాస్త పెరుగుతున్న నేపథ్యంలో స్టాలిన్ నేతృత్వంలోని తమిళనాడు సర్కార్ అలర్ట్ అయ్యింది. కరోనాను నియంత్రించడానికి బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ను తప్పనిసరి చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా మాస్క్ను ధరించని పక్షంలో 500 రూపాయల జరిమానా విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాధాకృష్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు.
బహిరంగ ప్రదేశాల్లో ఎవరైతే మాస్క్ లేకుండా తిరుగుతుంటారో వారికి 500 రూపాయల జరిమానా విధిస్తాం. వీటికి సంబంధించిన ఉత్తర్వులను కింది స్థాయి అధికారులకు కూడా చేరవేశాం అని ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ పేర్కొన్నారు. కరోనా తగ్గుముఖం పట్టిందన్న తప్పుడు భావనలో ప్రజలు ఉండిపోయారని, బహిరంగ ప్రదేశాల్లో ఏమాత్రం మాస్కులు ధరించడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రయాణాలు, రద్దీ ప్రాంతాల్లో కూడా మాస్క్ ధరించడం లేదన్నారు.