చెన్నై, మార్చి 23: ఆన్లైన్ జూదాన్ని నిషేధిస్తూ చేసిన బిల్లును తమిళనాడు అసెంబ్లీ రెండోసారి ఏకగ్రీవంగా ఆమోదించింది. మొదటిసారి చేసిన బిల్లును గవర్నర్ ఆర్ఎన్ రవి మార్చి 8న తిప్పి పంపించారు. బిల్లుపై అదనపు సమాచారం అవసరమని, పలు మార్పులు చేయాలని సూచించారు.
దీంతో తమిళనాడు ప్రభుత్వం గురువారం మరోసారి బిల్లును ప్రవేశపెట్టింది. కాగా, మొదటిసారి బిల్లు పంపినప్పుడు గవర్నర్ ఆమోదం కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఈ-గేమింగ్ ఫెడరేషన్ ప్రతినిధులతో గవర్నర్ సమావేశం కావడాన్ని పలువురు డీఎంకే ఎమ్మెల్యేలు సభలో లేవనెత్తారు.