RN Ravi | చెన్నై, జూన్ 29: తమిళనాడు ప్రభుత్వంతో నిత్యం కయ్యానికి కాలుదువ్వే ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ తనకుండే అధికారాలను మరిచి, తన పరిధిని దాటి ప్రవర్తించారు. ఇటీవల ఓ కుంభకోణానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని మంత్రిపదవి నుంచి భర్తరఫ్ చేస్తూ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రాజ్భవన్ నుంచి ఓ అధికారిక ప్రకటన వెలువడింది. ఈ అంశంపై మద్రాస్ హైకోర్టులో కేసు విచారణలో ఉండగానే గవర్నర్ నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదంగా మారింది. దీనిపై తీవ్రంగా మండిపడిన ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. గవర్నర్ తీరుపై డీఎంకే, ఇతర పార్టీలు మండిపడ్డాయి. గవర్నర్ను అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష పార్టీలు పాలిస్తున్న రాష్ర్టాలపై పెత్తనం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రయత్నిస్తున్నదని డీఎంకే దుయ్యబట్టింది. ‘మంత్రి సెంథిల్ బాలాజీ ఎన్నో క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. ఆయన మంత్రి పదవిలో కొనసాగడం వల్ల దర్యాప్తు ప్రక్రియకు విఘాతం కలుగుతుంది. అందువల్ల ఆయనను తక్షణమే పదవి నుంచి డిస్మిస్ చేస్తున్నాం’ అని రాజ్భవన్ తెలిపింది.
సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్టు చేసిన నేపథ్యంలో సీఎం స్టాలిన్ ఆయనను మంత్రిగా కొనసాగిస్తూ.. శాఖలను ఇతర మంత్రులకు బదలాయించారు. ఈ విషయాన్ని ఆయన గవర్నర్కు తెలియపరిచారు. దీంతో నేరవిచారణ ఎదుర్కొంటున్న సెంథిల్ను క్యాబినెట్ నుంచి తొలగించాలని కొందరు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ ఎస్వీ గంగాపూర్వాల, జస్టిస్ పీడీ ఆదికేశవులు దీనిపై విచారణ జరిపారు. రెండేండ్లు అంతకుమించి జైలు శిక్ష పడిన వారే ప్రజాప్రతినిధులుగా అనర్హులు అవుతారని కోర్టు పేర్కొంది. ఆర్టికల్ 164(1) ప్రకారం క్యాబినెట్ సలహా మేరకు మంత్రిని బర్తరఫ్ చేసే అధికారం గవర్నర్కు ఉందని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూలై 7కు వాయిదా వేసింది.
మంత్రి సెంథిల్ బాలాజీని భర్తరఫ్ చేసే హక్కు గవర్నర్కు లేదని ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ పేర్కొన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని ఆయన తెలిపారు. డీఎంకే మిత్రపక్షాలు, లెఫ్ట్ పార్టీలు గవర్నర్ చర్యను వ్యతిరేకిస్తూ ర్యాలీ నిర్వహించాయి. గత నాలుగైదు దశాబ్దాలలో ఇలా ఓ గవర్నర్ తనంతట తాను ఓ మంత్రిని బర్తరఫ్ చేయడం చూడలేదని రాజకీయ విశ్లేషకుడు దురై కరుణ పేర్కొన్నారు.