చెన్నై, జనవరి 10: రోజుకో వివాదం సృష్టిస్తూ రాష్ట్ర ప్రభుత్వంతో కయ్యానికి కాలు దువ్వుతున్న తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి పొంగల్ పండుగకు రాజ్భవన్ తరఫున ముద్రించిన ఆహ్వాన పత్రికలలో రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నాన్ని ముద్రించడం విస్మరించారు. పైగా ఆ పత్రికలో తమిళనాడు అని కాకుండా ‘తమిళగం’ అని ముద్రించి రాష్ట్రం పేరును మార్చివేశారు. దీనిపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ సోమవారం నాడు అసెంబ్లీ నుంచి ఎంత వేగంగా బయటికి వెళ్లిపోయారో అంతే వేగంగా రాష్ట్రం విడిచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. సామాజిక మాధ్యమాలలో మంగళవారం ‘గెట్ అవుట్ రవి’ అన్న హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్ అయ్యింది.
గవర్నర్ను బర్తరఫ్ చేయాలి..
రాష్ర్టానికి తమిళనాడు అన్న పేరు సరైంది కాదని గవర్నర్ ఇటీవల వ్యాఖ్యానించారు. అన్నట్టుగానే రాజ్భవన్లో నిర్వహించే పొంగల్ ఉత్సవాల కోసం ముద్రించిన ఆహ్వాన పత్రికలలో తమిళగం అని తమిళ భాషలో తమిళ్నాడు అని ఆంగ్లంలో ముద్రించడం ఇప్పుడు వివాదాస్పదమైంది. పైగా ఆ పత్రికపై జాతీయ చిహ్నాన్ని ముద్రించి, రాష్ట్ర చిహ్నాన్ని విస్మరించారు. తమిళగం అంటూ గవర్నర్ ఆరెస్సెస్ ఎజెండాను ముందుకు తెస్తున్నారని, ఆయన ప్రకటనలు, వ్యాఖ్యలు తీవ్ర తప్పిదమైనవి, ప్రమాదకరమైనవి అని డీఎంకే నేత టీఆర్ బాలు పేర్కొన్నారు. పొంగల్ ఆహ్వాన పత్రికలో గత సంవత్సరం తమిళనాడు గవర్నర్ అని ముద్రించి ఈ ఏడాది తమిళగం గవర్నర్ అని ముద్రించారని సీపీఎం ఎంపీ సు వెంకటేశన్ గుర్తు చేశారు.
గవర్నర్ వెంటనే రాష్ర్టాన్ని వదిలి వెళ్లాలని లేదా ఆయనను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రజలను రెచ్చగొట్టే విధంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. డీఎంకే, దాని మిత్రపక్షాల సభ్యులు మంగళవారం అసెంబ్లీలో ‘తమిళనాడు’ అంటూ నినాదాలు చేశారు. ఆర్ఎన్ రవిని వెనక్కి పిలవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
పోస్టర్ వార్
తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ‘గెట్ అవుట్ రవి’ అంటూ పోస్టర్లు వేశారు. వీటిపై సీఎం స్టాలిన్ ఫొటోను ముద్రించారు. మరోవైపు బీజేపీ శ్రేణులు సైతం గవర్నర్ను సమర్థిస్తూ పుదుకొైట్టె ప్రాంతంలో పోస్టర్లు వేశాయి. ట్విట్టర్లో సైతం ఆయనను సమర్థించే వారు పోస్ట్లు పెట్టారు. స్టాలిన్ కుమారుడు, రాష్ట్ర మంత్రి ఉదయనిధి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. గవర్నర్ అసెంబ్లీ నుంచి వెళ్లిపోవడం అసాధారణ ఘటన అని వ్యాఖ్యానించారు. ‘సాధారణంగా మన నాయకుడు తన సమాధానాలతో ప్రతిపక్షాలను పరుగులు పెట్టిస్తుంటారు. కానీ ఈ సారి గవర్నర్ పారిపోయారు’ అంటూ ఎద్దేవా చేశారు. గవర్నర్కు వ్యతిరేకంగా కోయంబత్తూర్లో ఆందోళనకారులు ఆయన దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించారు.