Tamil Nadu | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్,(నమస్తే తెలంగాణ): రోడ్డుపక్కన చిలక జోస్యం చెప్పుకొనేవారిని తరుచూ చూస్తూనే ఉంటాం. తమిళనాడులోని కడలూరుకు చెందిన ఇద్దరు సోదరులు కూడా ఇలాగే చిలకజోస్యం చెప్పుకొంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పీఎంకే కడలూర్ ఎంపీ అభ్యర్థి థంకూర్ బచ్చన్ ఇటీవల ప్రచారం చేస్తూ అటువైపుగా వచ్చారు. పనిలోపనిగా చిలక జోష్యం చెప్పించుకొన్నారు.
వచ్చే ఎన్నికల్లో బచ్చన్ తప్పకుండా గెలుస్తారని జ్యోతిషులు చెప్పారు. ఈ వార్త చివరకు పోలీసుల చెవిలో పడింది. దీంతో ఆ ఇద్దరు జ్యోతిష్యులను పోలీసులు అరెస్టు చేశారు. తన గెలుపు వార్తను ఓర్వలేకే అధికార డీఎంకే నేతలు సామాన్యులను అరెస్టులతో వేధిస్తున్నారని బచ్చన్.. స్టాలిన్ సర్కారుపై మండిపడ్డారు. అయితే, చిలకలను బోనులో బంధించిన కారణంతో వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972 కింద మాత్రమే జ్యోతిష్యులను అరెస్టు చేసినట్టు పోలీసులు పేర్కొనడం గమనార్హం.