చెన్నై: హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసిన సీడీఎస్ బిపిన్ రావత్ సహా జవాన్లకు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. వెల్లింగ్టన్ మద్రాస్ రెజిమెంటల్ కేంద్రంలో ఉన్న సీడీఎస్ రావత్ భౌతికకాయానికి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నివాళులర్పించారు. ఆయన భౌతికకాయం వద్ద పుష్పగుచ్చం ఉంచిన సీఎం స్టాలిన్.. రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు.
కాగా, బుధవారం తమిళనాడులోని ఊటీ కొండల్లో ఐఏఎఫ్ హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన భౌతికకాయం గురువారం సాయంత్రానికి ఢిల్లీ చేరుకోనుంది. కోయంబత్తూరు నుంచి వాయుసేన ప్రత్యేక విమానంలో తరలించనున్నారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో రావత్ భౌతికకాయం ఉంచనున్నారు.
రేపు మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల సందర్శనార్థం అక్కడ ఉంచుతామని అధికారులు ప్రకటించారు. కామరాజ్ మార్గ్ నుంచి ఢిల్లీ కంటోన్మెంట్లోని బ్రార్ స్వ్వేర్ శ్మశానవాటిక వరకు అంతిమయాత్ర కొనసాగుతుందని తెలిపారు. సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామన్నారు.
జనరల్ రావత్ సహా 13 మంది మృతిపై కేంద్ర ప్రభుత్వం నేడు ప్రకటన చేయనుంది. పార్లమెంటు వేదికగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెలికాప్టర్ ప్రమాదంపై ప్రకటించనున్నారు. తొలుత లోక్సభ, తర్వాత రాజ్యసభలో రాజ్నాథ్ ప్రకటన చేస్తారు.