చెన్నై, మార్చి 11: కేంద్రప్రభుత్వం, గవర్నర్ ఆర్ఎన్ రవిపై తమిళనాడు సీఎం స్టాలిన్ మరోసారి విరుచుకుపడ్డారు. రైతులు, మైనార్టీలకు వ్యతిరేకంగా వివాదాస్పద చట్టాలను వారు ఎలాంటి జాప్యం లేకుండా తీసుకొస్తారు కానీ, ఆన్లైన్ గ్యాంబ్లింగ్కు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన బిల్లుకు మాత్రం మోకాలడ్డుతున్నారని విమర్శించారు. సాధారణ బిల్లులకు కూడా గవర్నర్ ఆమోదం తెలపడం లేదని ఆరోపించారు.
ఆన్లైన్ రమ్మీ ఆటను నిషేధిస్తూ చట్టం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తిప్పి పంపారని, ఇంత సాధారణ చట్టం కూడా చేసుకునే అధికారం లేని రాష్ర్టానికి ఆయన గవర్నరా? అని ప్రశ్నించారు. నీట్ పరీక్ష నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలని చేసిన బిల్లును కూడా ఆపారని పేర్కొన్నారు. ఐయూఎంఎల్ 75వ వార్షికోత్సవాల్లో స్టాలిన్ ప్రసంగించారు. సామాజిక న్యాయం, సోదరభావం, సమానత్వం అనే మూడింటికి భారత్ను రక్షించే శక్తి ఉందన్నారు. భారత్లో ఒకే విశ్వాసం, ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే ఎన్నిక, ఒకే పరీక్ష లాంటి ఏక విధానం అమలు చేసేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు సామాజిక న్యాయానికి, సమానత్వానికి, సోదరభావానికి వ్యతిరేకమని పేర్కొన్నారు.