చెన్నై: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిని మార్చవద్దని సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin) అన్నారు. లోక్సభ ఎన్నికల వరకు కొనసాగనివ్వాలంటూ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు చురకలు వేశారు. గవర్నర్ తన వ్యాఖ్యలతో డీఎంకే ఎన్నికల ప్రచారానికి సాయం చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. శుక్రవారం చెన్నైలో జరిగిన ఒక వివాహ కార్యక్రమంలో సీఎం స్టాలిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన 2024లో లోక్సభ ఎన్నికలు జరిగే వరకు గవర్నర్ రవిని కొనసాగించాలని అన్నారు. ‘ద్రవిడం అంటే ఏమిటి? అని పదే పదే అడిగే వ్యక్తి (గవర్నర్ ఆర్ఎన్ రవి)ని కొనసాగనివ్వండి. ఇది మా ప్రచారానికి బలం చేకూరుస్తుంది’ అని వ్యాఖ్యానించారు. ‘తమిళనాడు గవర్నర్ను మార్చవద్దని ప్రధాని మోదీని, అమిత్షాను కోరుతున్నా. లోక్సభ ఎన్నికలు జరిగే వరకు ఆయనను ఇక్కడే కొనసాగించనివ్వండి. ఆయన మనసుకు నచ్చినవన్నీ మాట్లాడుతున్నారు. కానీ ప్రజలు దానిని సీరియస్గా తీసుకోవడం లేదు’ అని అన్నారు.
కాగా, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వం మధ్య తొలి నుంచి విభేదాలు నెలకొన్నాయి. సీఎం ఎంకే స్టాలిన్ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన పలు బిల్లులను ఆయన నిరాకరించారు. ప్రభుత్వ విధుల్లో కూడా ఆయన జోక్యం పెరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో గవర్నర్ రవి, సీఎం స్టాలిన్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది.