చెన్నై: మిగ్జాం తుఫాన్(Michuang Cyclone)తో తమిళనాడు రాష్ట్రంలో భారీగా వర్షాలు కురిశాయి. చెన్నైతో పాటు అనేక ప్రాంతాల్లో వరదల్లో మునిగిపోయాయి. భారీ నష్టం సంభవించిన నేపథ్యంలో.. ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ ఇవాళ కేంద్రానికి లేఖ రాశారు. తక్షణమే రిలీఫ్ ఫండ్ కింద రూ.5060 కోట్లు ఇవ్వాలని ప్రధాని మోదీని కోరుతూ సీఎం స్టాలిన్ లేఖ రాశారు. మిగ్జాం వల్ల నష్టం జరిగిందని, ఆ నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర సర్కారు బృందాన్ని పంపాలని ఆయన కోరారు. ఢిల్లీలో డీఎంకే ఎంపీ టీఆర్ బాలు స్వయంగా ఆ లేఖను ప్రధాని మోదీకి అందజేయనున్నారు.
మిగ్జాం తుఫాన్ మంగళవారం మధ్యాహ్నం బాపట్ల సమీపంలో తీరం దాటింది. ఇప్పటికే తమిళనాడులో జల విలయానికి కారణమైన తుఫాన్ ఏపీలోనూ బీభత్సం సృష్టించింది. వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. అటు రాయలసీమ ప్రాంతంలోనూ, ఇటు తెలంగాణలోనూ మిగ్జాం తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు నమోదయ్యాయి. కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో 96.8 మి.మీ వర్షం కురిసింది. నేడు, రేపు తెలంగాణలో వర్షాలు ఉంటాయని వాతావరణశాఖ హెచ్చరించింది.