చెన్నై : మధురై జిల్లాలో తలపెట్టిన ఎయిమ్స్ ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోదీకి శనివారం లేఖ రాశారు. ఎయిమ్స్ మధురై ప్రాజెక్టు సత్వర నిర్మాణం కోసం ఆర్థిక, పాలనాపరమైన అధికారాలు కలిగిన ప్రత్యేక అధికారులను నియమించాలని స్టాలిన్ కోరారు. మధురైలో 2019లో ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా ఎయిమ్స్ కు శంకుస్ధాపన జరిగినా ప్రహారీ నిర్మాణం మినహా ఎలాంటి పురోగతి లేదని ఈ లేఖలో స్టాలిన్ ప్రస్తావించారు.
మధురైలో ఎయిమ్స్ నిర్మాణంతో తమిళనాడులోని దక్షిణ జిల్లాలు, పొరుగు రాష్ట్రాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు లభిస్తాయని అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఇక ఎయిమ్స్ మధురై ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరిగినందున మరో ప్రాంతంలో తాత్కాలికంగా ఈ సంస్థ కార్యకలాపాలను ప్రారంభించే ప్రతిపాదననూ పరిశీలించాలని ప్రధానికి రాసిన లేఖలో స్టాలిన్ విజ్ఞప్తి చేశారు.