చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడం కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో వరద ముంపునకు గురైన ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు సీఎం స్టాలిన్ ప్రజలకు సహాయ సహకారాలపై ఎప్పటికప్పుడు అధికారులతో సమావేశమవుతున్నారు. వర్ష బాధితుల కోసం ఒక కేంద్రంలో ఆహార తయారీని ఆయన సమీక్షించారు. వండిన ఆహారాన్ని రుచి చూశారు. అవసరమైన వారికి పంపిణీ చేస్తామని చెప్పారు. భారీ వర్షాలు ముగిసే వరకు అమ్మ క్యాంటీన్ల ద్వారా ప్రజలకు ఉచితంగా ఆహారం అందించాలని అధికారులను ఆదేశించారు.
కాగా, ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు తమిళనాడులో 11 బృందాలు, పుదుచ్చేరిలో 2 బృందాలను నియమించినట్లు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) 4వ బెటాలియన్ కమాండర్ రేఖా నంబియార్ తెలిపారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు మరో 5 బృందాలను సిద్ధం చేసినట్లు చెప్పారు. అన్ని రకాల విపత్తులను ఎదుర్కోవడానికి అన్ని బృందాలు తగిన పరికరాలతో సర్వసిద్ధంగా ఉన్నాయని వివరించారు. వరదలకు ప్రభావితం కాని ప్రజలు తమ ఇండ్లలోనే ఉండాలని ఆమె సూచించారు.