న్యూఢిల్లీ: 1954 నాటి ఐఏఎస్ (క్యాడర్) రూల్స్ను మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలకు కత్తెరపెట్టి అన్ని రాష్ట్రాలను తన గుప్పిట్లోకి తీసుకోవాలన్న కుట్రతోనే కేంద్ర ప్రభుత్వం ఐఏఎస్ రూల్స్ మార్పు కోసం ప్రయత్నిస్తున్నదని రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. ఐఏఎస్ అధికారులను బదిలీ చేసే అధికారాన్ని తమ చేతి నుంచి లాక్కుంటే పాలన కుంటుపడుతుందని ఆందోళన వ్యక్తంచేశాయి.
కేంద్రం ప్రతిపాదిస్తున్న సవరణల ప్రకారం రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులను డిప్యూటేషన్పై కేంద్ర సర్వీసుల్లోకి తీసుకునే అవకాశం ఉంటుంది. అది చాలా ప్రమాదకరమని రాష్ట్రాలు వాదిస్తున్నాయి. రాష్ట్రాల్లో కీలక ప్రాజెక్టుల బాధ్యతలు చూస్తున్న ఐఏఎస్లను కేంద్రం డిప్యుటేషన్పై తీసుకెళ్తే.. ఆ ప్రాజెక్టులు ఆగిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నాయి. అందుకే కేంద్రం ఈ ఆలోచనను విరమించుకోవాలని పలు రాష్ట్రాలు కేంద్రానికి లేఖలు రాస్తున్నాయి.
ఇప్పటికే రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఐఏఎస్ రూల్స్ మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీకి లేఖలు రాశారు. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా ఆ జాబితాలో చేరారు. ఐఏఎస్ రూల్స్ను మార్చవద్దంటూ ఆయన కూడా ప్రధానికి లేఖ రాశారు. అందుకు బదులుగా రాష్ట్ర ప్రభుత్వాలకు దన్నుగా నిలుస్తూ జాతి సమాఖ్య స్ఫూర్తిని బలోపేతం చేయాలని తన లేఖలో కోరారు.